షాకింగ్‌: వైసీపీలోకి జ‌న‌సేన నాయ‌కులు!

ఒక‌వైపు అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అయిపోయింది. వైసీపీలో ఖాళీ సీట్లు కూడా లేవు. ఉన్నా.. సొంత పార్టీ నాయ‌కులే ఖాళీగా ఉన్నారు. వీరిని కాద‌ని వేరే వారికి టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. అయినా.. అదేం చిత్ర‌మో కానీ.. జ‌న‌సేన పార్టీ నుంచి తాజాగా వైసీపీలోకి నాయ‌కులు క్యూ క‌ట్టారు. రెండు జిల్లాల‌కు చెందిన ప‌వ‌న్ అనుకూల నాయ‌కులు, జ‌న‌సేనలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లు ఇలా వైసీపీ వైపు మ‌ళ్ల‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.  వీరిలో విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి బత్తిన రాము(జ‌న‌సేన‌లో కీల‌క నేత‌. ప‌వ‌న్ ఎప్పుడు విజ‌య‌వాడ‌కు వ‌చ్చినా.. బ‌త్తిన రాము కోసం వేచి ఉన్న సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి)  వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికారు.  అదేవిధంగా విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు  గండూరి మహేశ్, సందెపు జగదీశ్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి తదితరులు కూడా వైసీపీలో చేరారు. వీరంతా విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వ‌ర్యంలో కండువాలు మార్చుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, కీల‌క‌మైన‌ విశాఖప‌ట్నం జిల్లాకు చెందిన‌ జనసేన నాయకులు బొడ్డేటి అనురాధ, బొగ్గు శ్రీనివాస్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బొడ్డేటి అనురాధ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించారు. కానీ, ఆమె పేరు ప‌రిశీల‌న‌లోకి కూడా రాలేదు. ఇక‌, బొగ్గు శ్రీనివాస్ కూడా జిల్లాలో జ‌న‌సేన‌కు కీల‌క నాయ‌కుడిగా ఉన్నారు. ఈయ‌న కూడా పార్టీ మారిపోయారు. ఈయ‌న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. గ‌తంలో జ‌రిగిన విశాఖ‌, శ్రీకాకుళంలోని ర‌ణ‌స్థ‌లం జ‌న‌సేన స‌భ‌ల‌కు భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించి.. జ‌న‌సేనాని ప‌వ‌న్ అభినంద‌న‌లు కూడా అందుకున్నారు.

టీడీపీ నుంచి..

టీడీపీలో తీవ్ర అసంతృప్తికి గురైన నాయ‌కులు కూడా వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. వీరిలో క‌డ‌ప జిల్లా రాజంపేట టీడీపీ ఇన్చార్జి గంటా నరహరి(ఈయ‌న రాజంపేట టికెట్ ఆశించారు. కానీ, ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. దీంతో కొన్నాల్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు) తాజాగా వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పారు. అదేవిధంగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని నూజివీడు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్‌ చిన్నం రామకోటయ్య కూడా ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న కూడా టికెట్  ఆశించారు. కానీ, ద‌క్క‌లేదు. నూజివీడు టికెట్‌ను చంద్ర‌బాబు వైసీపీ నుంచి ఇటీవ‌ల టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థికి కేటాయించారు.