రఘురామ బయటపెట్టిన బీజేపీ కుట్ర

ఐదేళ్ల కిందట నరసాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి.. కొన్ని నెలలకే రెబల్‌గా మారిన నేత రఘురామ కృష్ణం రాజు. గత నాలుగున్నరేళ్లలో జగన్ సర్కారును ఆయన స్థాయిలో ఎవ్వరూ తూర్పారబట్టలేదంటే అతిశయోక్తి కాదు. రచ్చబండ పేరుతో జగన్ సర్కారు వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. దీంతో ఏపీ సీఐడీ విభాగం ఆయన్ని ఏదో కేసులో అరెస్ట్ చేయడం.. తనను లాకప్‌లో చిత్రహింసలు పెట్టారని రఘురామ వెల్లడించడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే.

ఐతే అందుకు బదులుగా నరసాపురం నుంచి ఎంపీగా ఘనవిజయం సాధించి వైసీపీకి చెక్ పెట్టాలని రఘురామ భావించారు. ఐతే ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనేదే సస్పెన్సుగా మారింది. చివరికి బీజేపీ తరఫున నరసాపురం బరిలో ఉంటారని భావించారు. కానీ అనూహ్యంగా ఆ స్థానానికి వేరే అభ్యర్థిని ప్రకటించి రఘురామకు మొండిచేయి చూపించింది బీజేపీ.

దీంతో రఘురామ ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారు. తనకు వ్యతిరేకంగా సోము వీర్రాజు కుట్ర చేశారని.. జగన్ కూడా లాబీయింగ్ చేసి సీట్ రాకుండా చేశారని రఘురామ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ తనను ఎలా మోసం చేసిందో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర రీతిలో వెల్లడించారు. ‘‘బీజేపీ వాళ్లు నరసాపురంలో సర్వే జరపగా.. నేను భారీ మెజారిటీతో గెలుస్తానని తేలింది. వైసీపీ అభ్యర్థి కంటే 25 శాతం ఓట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ వాళ్లే చెప్పారు.

అందుకే టీడీపీ నుంచి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం తీసుకుందామని బీజేపీ వాళ్లు నాతో అన్నారు. కానీ నా గొంతు కోయాలంటే ముందు టీడీపీ నుంచి ఆ స్థానం తీసుకోవాలి కదా.. అందుకే అలా చేశారు. ఆ స్థానం తమ చేతికి వచ్చాక ఊరూ పేరు లేని అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. నరసాపురం నుంచి నేను పోటీ చేస్తానన్న ఉద్దేశంతోనే టీడీపీ వాళ్లు ఆ స్థానాన్ని బీజేపీకి వదిలేశారు. కానీ తీరా జరిగింది వేరు. చంద్రబాబు గారు నాకు ఇప్పుడు న్యాయం చేయాలి. బీజేపీ కూడా ఈ తప్పును సరిదిద్దుకోవాలి’’ అని రఘురామ అన్నారు.