ప‌వ‌న్ వ‌ర్సెస్ గీత‌.. ఆస్తుల్లోనూ పోటీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఈయ‌న‌పై వైసీపీ త‌ర‌ఫున సీనియ‌ర్ నాయ‌కురాలు, కాకినాడ ఎంపీ వంగా గీత ఢీ అంటున్నారు. వీరిద్ద‌రి విష‌యం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న తెలిసిందే. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? అనేది ఒక చ‌ర్చ అయితే.. ఎవ‌రెవ‌రి ఆస్తులు ఎంత‌? అనేది కీల‌కంగా మారింది. ఇటీవ‌ల ప‌వ‌న్ మాట్లాడుతూ.. త‌న‌ను ఓడించ‌డానికి ఓటుకురూ.ల‌క్ష ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేద‌న్నారు. దీంతో గీత ద‌గ్గ‌ర అంత సొమ్ము ఉందా? అని టీడీపీ నాయ‌కులు ఆరా తీస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు కూడా ప‌వ‌న్ ద‌గ్గర ఉన్న ఆస్తుల‌పై లెక్క‌లు తీశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీరి ఆస్తుల వివ‌రాలు ఆస‌క్తిగా మారాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.57 కోట్లుగా లెక్క‌గ‌ట్టారు. అప్పులు కూడా బాగానే ఉన్నాయి. ఇవి రూ.34 కోట్ల వరకూ ఉన్నాయని లెక్క తేలింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్‌ డిపాజిట్లు, బాండ్లు రూ.6 కోట్లు వరకు ఉన్నాయి. మరో రూ.3 కోట్లు సేవింగ్స్ ఉన్నాయి. పవన్‌కల్యాణ్ వద్ద మెర్సిడెస్ బెంజ్-350, టయోటా పార్చునర్, స్కోడా ర్యాపిడ్‌, మహేంద్ర స్కార్పియో, వోల్వో , హార్లీడేవిడ్సన్‌ బైక్‌ ఉన్నాయి.

వీటి విలువ దాదాపు రూ.2.75 కోట్ల వరకూ ఉంది. మొత్తం చరాస్తుల విలువ రూ.15 కోట్లకు పైగానే ఉంది. హైదరాబాద్ శివారులో 18 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు హైదరాబాద్‌లో 4 ఇళ్లు, మంగళగిరిలో రెండు ఇళ్లు ఉన్నాయి. వీటి విలువ రూ.34 కోట్లు ఉన్నాయి. అలాగే ర‌ష్యాలోనూ ఆయనకు ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ ఉంది. వీటి మొత్తం విలువ రూ.1.75 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. ఈ స్థిరాస్తుల విలువ రూ.42 కోట్ల వరకు చూపారు. వివిధ బ్యాంకుల నుంచి ఆయన పేరిట ఉన్న అప్పులు రూ.34 కోట్ల వరకు ఉన్నాయి.

గీత ఆస్తులు కూడా త‌క్క‌వేమీ కాదు..

వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన ఎంపీ వంగా గీత ఆస్తులు కూడా కోట్ల‌లోనే ఉన్నాయి. ఆమెకు నిక‌రంగా ఉన్న ఆస్తి రూ.20 కోట్ల‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవి కాకుండా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, బంగారం , వాహనాలు అన్నీ కలిపి రూ.1.20 కోట్లుగా ఉన్నాయి. వివిధ చోట్ల 25 ఎకరాల వ్యవసాయ భూమి, 8 ప్లాట్లు, 10 ఇళ్లు, కమర్షియల్ బిల్డింగ్‌ ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు రూ.3.50 కోట్ల వరకు ఉంది. మొత్తంగా నాయ‌కుల పోటీపైనే కాదు.. వారి ఆస్తుల‌పై కూడా ఆస‌క్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.