ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల అరెస్టు.. ‘ఇండియా’ ఎఫెక్ట్‌!

రెండు నెల‌లు.. కేవ‌లం రెండే నెల‌లు.. కానీ, ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల అరెస్టు. ఇదేమీ ఆషామాషీ కాదు. అత్యంత భ‌యంక‌ర‌మైన కేసులు కూడా లేవు. అయినా.. టార్గెట్ స్టేట్స్‌. అందుకే.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులను రాత్రికి రాత్రి అరెస్టు చేశారు. వీరిలో ఒక‌రు యువ నాయ‌కుడు, గిరిజ‌న నేత జార్ఖండ్ అప్ప‌టి ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్‌. ఇక‌, ఇప్పుడు ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌. ఈ ఇద్ద‌రి అరెస్టూ.. యాదృచ్ఛికం కాదు.. బ‌ల‌మైన కేసులు.. నేరాలు కూడా జ‌రిగిపోయిన‌వి కాదు.. వారి చేతులు ర‌క్తంతోనూ త‌డిచిపోలేదు.

అయినా అరెస్టు అయ్యారు. దీనికి కార‌ణం.. బీజేపీతో మిలాఖ‌త్ కాక‌పోవ‌డ‌మే. అది 2023, డిసెంబ‌రు 3వ తేదీ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఓ స‌భ‌లో మాట్లాడి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర మంత్రి వ‌ర్గంలోని జార్ఖండ్‌కు చెందిన నాయ‌కుడు ఒక‌రు ఆయ‌న‌కు ఫోన్ చేశారు. మీరు మేం క‌లిసిపోదాం.. మాకు మీ మ‌ద్ద‌తు ఇవ్వండి.. అని ఆయ‌న అడ‌గ‌లేదు. “మీరు ఇండియా కూట‌మిలో ఉన్నారు. ఈ ప్ర‌య‌త్నాలు విర‌మించుకోండి. మాతో చేతులు క‌ల‌పొద్దు. కానీ, ఇండియాలో చేర‌ద్దు” అని చెప్పారు.

క‌ట్ చేస్తే.. రెండు రోజుల త‌ర్వాత‌.. ఇదే విష‌యాన్ని హేమంత్ మీడియాకు చెప్పేశారు. అంతే.. ఆ మ‌ర్నాడు నుంచి ఆయ‌న‌కు ఈడీ ప్ర‌జ‌ర్ ప్రారంభ‌మైంది. ఎప్పుడో ఎక్క‌డో జ‌రిగిన గ‌నుల కేసులో నీ ప్ర‌మేయం ఉందంటూ.. ఈడీ అధికారులు ఆయ‌న‌పై ఒత్తిడి చేశారు. అయితే.. త‌న ప్ర‌మేయం లేకుండానే జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. అయినా విన‌లేదు. చివ‌ర‌కు అరెస్టు చేశారు. కార‌ణం ఇండియా కూట‌మికి జై కొట్ట‌డ‌మే.

ఇక‌, కేజ్రీవాల్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న‌కు లిక్క‌ర్ కేసులో ప్ర‌మేయం లేదు. ఆయ‌న ముడుపులు కూడా తీసుకోలేదు. తీసుకున్న‌వారిని కూడా ఆయ‌న ప్రోత్స‌హించిన‌ట్టు రుజువు కూడా లేదు. కానీ, ఆయ‌న అరెస్ట‌య్యారు. దీనికి కార‌ణం.. ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. “మ‌మ్మ‌ల్ని బీజేపీతో క‌లిసిపోవాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. బీజేపీతో క‌లిస్తే కేసులు లేకుండా చూస్తామ‌ని చెబుతున్నారు” అని వారం కింద‌ట కూడా ప‌దే ప‌దే ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. ఇండియా కూట‌మిలో చేర‌ద్దొని బెదిరింపులు కూడా వ‌చ్చాయ‌న్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అరెస్ట‌య్యారు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?! కేసులు నిజ‌మా? రాజ‌కీయం నిజ‌మా?!!