ఆ రోజు ఏం జ‌రిగింది ? ఏపీని కోరిన ఎన్నికల సంఘం

కీల‌కమైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లకు ముందు ఏపీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డేలా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌దాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీలో ప‌ర్య‌టించి.. గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరిపేట శివారులో ఉన్న బొప్పూడిలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ స‌భ‌లో ఉద్దేశ పూర్వ‌క నిర్ల‌క్ష్యం కార‌ణంగా.. ఇబ్బందులు త‌లెత్తాయ‌నేది టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌. ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తున్న‌ స‌మ‌యంలో మైకులు ప‌నిచేయ‌క‌పోవ‌డం.. స‌భ‌కు వ‌స్తున్న‌వారు రాకుండా ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌క‌పోవ‌డంతో ఏపీ ప్ర‌భుత్వంపై అనుమానాలు పెరుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారుల‌కు 240 పైకిగా ఫిర్యాదులు అందించారు. వీటిని రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు.. వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్‌మీనాను ఆదేశించారు. ప్రధాని పాల్గొన్న సభలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును డీజీపీ నుంచి వివ‌ర‌ణ తీసుకుని త‌మ‌కు ఇవ్వాల‌ని కోరారు.

ఈ సభలో మైక్ సరిగా పనిచేయకపోవడం, మైక్ సెట్టింగ్ కంట్రోల్ వద్ద తోపులాట, లైటింగ్ టవర్లపైకి జనం ఎక్కడం, వారిని నియంత్రించాల్సిన పోలీసులు దరిదాపుల్లో లేకపోవడం వంటి అంశాలపై కూటమి నేతలు రెండ్రోజుల కిందట ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.

తాజాగా ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. ప్రధాని మోడీ హాజరైన ప్రజాగళం సభలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఈవోను కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఈవోను ఈసీ ఆదేశించింది. దీంతో ఎలాంటి ఆదేశాలు వ‌స్తాయోన‌ని ఇటు పోలీసులు, అటు వైసీపీ నాయ‌కులు కూడా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఈ విష‌యంలో పోలీసుల వైఫ‌ల్యం రుజువైతే.. డీజీపీ స‌హా.. గుంటూరు ఎస్పీ, ఐజీల‌పై వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.