ఇదీ ట్విస్ట్ అంటే: జగన్‌పై పోటీకి షర్మిల ‘సై’.!

కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలా రెడ్డి పోటీకి దిగబోతున్నారన్నది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం. కానీ, లేటెస్ట్ గాసిప్ ఏంటంటే, నేరుగా పులివెందులలోనే అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయంగా తలపడబోతున్నారట.

ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో, కడప నుంచి లోక్ సభకు పోటీ చేయాల్సిందిగా షర్మిలని పార్టీ సీనియర్లు కోరారట.

పార్టీ అధినాయకత్వమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటుందనీ, అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి వుండాలని ఈ సందర్భంగా తీర్మానం కూడా చేశారట. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటోన్న కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు కూడా, ‘నేనూ వున్నాను’ అంటున్నారు.

ఇక, తాజా సమావేశాల్లో రఘువీరారెడ్డి, పల్లం రాజు తదితరులు, ‘పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలి’ అంటూ వైఎస్ షర్మిలారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మీడియాకి లీకులు అందాయి. దాంతో, మీడియా ఆమెను ‘వైఎస్ జగన్ మీద పోటీ చేస్తున్నారా.?’ అని ప్రశ్నించింది.

‘కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశిస్తే, నేనైనా ఇంకెవరైనా.. పోటీ చేయాల్సిందే..’ అంటూ సెలవిచ్చారు వైఎస్ షర్మిల. నేరుగా ‘నేనే పోటీ చేస్తాను..’ అని షర్మిల చెప్పకపోయినా, ఆమె మాటల్లోని ఆంతర్యం సుస్పష్టం.
అయితే, వైఎస్ వివేకా కుటుంబం నుంచి ఎవరో ఒకరు (వివేకా కుమార్తె లేదా వివేకా సతీమణి) కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరి కంటే, షర్మిల పోటీ చేస్తేనే బావుంటుందన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది.