ఇక ఆ సీఎం అరెస్టు నుండి తప్పించుకోలేరు

కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు కేసులతో ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్న ఢిల్లీ ముఖ్య‌మంత్రికి మ‌రో షాక్ త‌గిలింది. మిమ్మ‌ల్ని అరెస్టు చేయ‌కుండా ఆప‌లేం అంటూ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలిన‌ట్టయింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు ఈ ఉదయం విచారించింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈడీ తరపు న్యాయవాదులు ఆధారాలను కోర్టు కు సమర్పించారు. ఈడీ అందించిన ఆధారాలను కోర్టు పరిశీలించింది. వాదనల సందర్భంగా ఈడీ తమ వాదనలను వినిపిస్తూ… కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో తాము సమన్లు జారీ చేయడం లేదని తెలిపింది. అయితే, రానున్న రోజుల్లో ఏదైనా జరగొచ్చని చెప్పింది.

ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని ఢిల్లీ కోర్టు తేల్చి చెప్పింది. కేసు ప్రస్తుత పురోగతి దృష్ట్యా ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. కాగా.. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఇప్ప‌టికే ఆమ్ ఆద్మీ పార్టికి చెందిన మంత్రులు అరెస్ట‌యి జైల్లో ఉన్నారు. ఇక‌, ఇప్ప‌టికే సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ 9 సార్లు స‌మ‌న్లు జారీ చేసింది. అయితే, వివిధ కార‌ణాల‌తో ఆయ‌న త‌ప్పించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈడీ అధికారులు కోర్టును ఆశ్ర‌యించారు. దీనికి సంబంధించి జ‌రిగిన విచార‌ణ‌లో కేజ్రీవాల్‌ను అరెస్టు నుంచి ర‌క్షించ‌లేమ‌ని కోర్టు తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.