ఇండియా కూట‌మిలోకి జేడీ?

ఏపీలో డ‌బ్బులు లేని ఎన్నిక‌లు తీసుకువ‌స్తామ‌ని పేర్కొంటూ రాజ‌కీయ పార్టీ పెట్టిన జై భారత్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మిలో చేరిపోయారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఇండియా కూట‌మి పార్టీల స‌మావేశాల‌కు ఆయ‌న కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ చేరిక‌పై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం డ‌బ్బులులేని, విలువ‌ల‌తో కూడిన ఎన్నిక‌లు అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, ఈ కార్యక్ర‌మంలో ఏపీసీసీ చీఫ్‌, వైఎస్ ష‌ర్మిల మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని, దేశంలో ఆ పార్టీ ఉన్మాదాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయింద ని చెప్పారు.

దేశ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమని షర్మిల నిప్పులు చెరిగారు. అంబానీ, అదానీలకు బీజేపీ నాయకులు దేశ సంప‌దను దోచి పెడుతున్నార‌ని ఆమె విమర్శించారు. స్థానిక ప్రభుత్వాలు కూడా బీజేపీ మెప్పు కోసం పని చేస్తున్నాయని ప‌రోక్షంగా పేరు చెప్ప‌కుండానే జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. ఏపీలో గంగవరం పోర్టును అదానీకి తక్కువ ధరకే కట్టబెట్టారని, విశాఖ స్టీల్ ను కూడా వీరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్య‌బ‌ట్టారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే నాయ‌కులు, పార్టీల‌పై ఈడీల‌ను ప్ర‌యోగిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

దాడులకు భయపడి బీజేపీపై ఇష్టం లేకపోయినా చాలామంది బీజేపీలో చేరుతున్నారని షర్మిల అన్నారు. చివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా కలుషితం చేశారని విమర్శించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని… ఆ తర్వాత దాన్ని విస్మరించిందని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఈ స‌మావేశానికి, సీపీఐ, సీపీఎం నాయ‌కులు కూడా పాల్గొన్నారు.