చంద్ర‌బాబుకు ఈసీ నోటీసులు.. మ‌రి వైసీపీ మాటేంటి?

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ కోడ్ కేవ‌లం ప్రతిప‌క్ష పార్టీల‌కు మాత్ర‌మే కాదు. అధికార పార్టీకి కూడా సంపూర్ణంగా వ‌ర్తిస్తుంది. కానీ, చిత్రంగా ప్ర‌తిప‌క్షంపైనే చర్య‌లు తీసుకోవడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఎందుకంటే..టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఎన్నిక‌ల సంఘం నోటీసులు జారీ చేసింది. అది కూడా సీఎం జ‌గ‌న్‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తో టీడీపీ సోష‌ల్ మీడియాలో ఎవ‌రో చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చంద్ర‌బాబును ఆదేశించింది. ఈ మేర‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నిక‌ల సంఘం ఆగ‌మేఘాల‌పై నిర్ణ‌యం తీసుకుంది.

టీడీపీకి చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ల ద్వారా జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసేలా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం వెంట‌నే రియాక్ట్ అయింది. చంద్ర‌బాబు నుంచి వివ‌ర‌ణ కోరుతూ ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చింది. అంతేకాదు.. ఆయా సోష‌ల్ మీడియాల్లోని పోస్టుల‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఆదేశించింది. క‌ట్ చేస్తే.. ఇదే వైసీపీపై టీడీపీ కూడా ఇప్ప‌టికి ప‌ది ఫిర్యాదులు చేసింది. అయితే.. ఒక్క ఫిర్యాదుపైనా ఇప్ప‌టి వ‌ర‌కు ఈసీ స్పందించ‌లేదు. ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌చార చిత్రాలు టిలి కాస్ట్ చేస్తున్నార‌ని టీడీపీ ఫిర్యాదు చేసింది.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన‌ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను వైసీపీ త‌న ప్ర‌చారానికి వినియోగించుకుంటోంద‌ని కూడా టీడీపీ లికిత పూర్వ‌కంగా వివ‌రించింది. వారికి ప్ర‌జ‌లు క‌ట్టిన ప‌న్నుల నుంచి వేత‌నాలు ఇస్తున్నార‌ని.. వారిని రాజ‌కీయంగా వినియోగించుకోవ‌డానికి వీల్లేద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే ఆదేశాలు ఇచ్చింద‌ని, అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ నాయ‌కులు వ‌లంటీర్ల‌ను నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారాల‌కు వినియోగిస్తున్నార‌ని.. ఇది కోడ్ ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని టీడీపీ అనేక ఫిర్యాదులు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ.. ఈసీ నుంచి ఉలుకు ప‌లుకు లేకుండా పోయింది.

పోనీ.. వీటికి సంబంధించిన ఆధారాలు లేవా? అంటే..ఉన్నాయి. అయినా కూడా.. ఈసీ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై ప్ర‌జాసంఘాల నుంచి పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. లాలూచీ ప‌డింద‌ని ఎవ‌రూ అనక‌పోయినా.. చ‌ర్య‌లు తీసుకోకపోవ‌డం వెనుక‌.. ఈసీపైనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని ఆయా సంఘాల నాయ‌కులు చెబుతున్నారు.