వైసీపీ ఖాతాలో 442 కోట్లు.. బాండ్ల ఎఫెక్ట్‌

ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రు ఇచ్చారో.. తెలియ‌ని ఈ బాండ్ల నిధులు కోట్ల కు కోట్ల రూపంలో పార్టీల‌కు చేరిపోయాయి. సుదీర్ఘంగా 2019 నుంచి సాగిన ఈ బాండ్ల వ్య‌వ‌హారం.. తాజాగా సుప్రీం కోర్టు జోక్యంతో బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ క్ర‌మంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. సీల్ట్‌ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ క్రమంలోనే కొత్త సమాచారాన్ని ఈసీ అందుబాటులో ఉంచింది. ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం.. ఏపీ అధికార పార్టీకి ఏకంగా 442 కోట్ల రూపాయ‌లు ముట్టాయి. దీనిని ఎవ‌రు ఇచ్చారు? ఎంత మంది ఇచ్చారు? అనేది ప్ర‌స్తుతానికి గోప్యంగా ఉంచారు. మ‌రోసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఆ వివ‌రాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, మ‌రో ప్రాంతీయ పార్టీ, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి 181 కోట్ల రూపాయ‌ల సొమ్ము ద‌క్కింది. ప‌లువురు టీడీపీకి అనుకూలంగా ఎస్‌బీఐలో బాండ్లు కొనుగోలు చేశారు.

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకీ ద‌క్క‌నంత సొమ్ము ద‌క్కింది. ఏకంగా రూ.1322 కోట్ల రూపాయ‌ల‌ను ఈ పార్టీ త‌న ఖాతాలో వేసుకుంది. ఒడిశాలో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వం లోని బిజు జ‌న‌తాద‌ళ్‌ కూడా ఏమీ త‌క్కువ తిన‌లేదు. ఈ పార్టీకి కూడా 944 కోట్ల రూపాయ‌లు బాండ్ల రూపంలో అందాయి.

జాతీయ పార్టీల్లో బీజేపీ అత్యధికంగా రూ.6,986.5 కోట్లు విరాళాలను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో పొందింది. కాంగ్రెస్ పార్టీకి 1334 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ – రూ.1,397 కోట్లు, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే – రూ.656.5 కోట్లు ముట్టాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సమాజ్‌వాదీ పార్టీ – రూ.14.5 కోట్లు ద‌క్కించుకుంది. పంజాబ్‌కు చెందిన అకాలీదళ్‌ – రూ.7.26కోట్లు, త‌మిళ‌నాడు విప‌క్షం ఏఐఏడీఎంకే – రూ.6.05కోట్లు, జమ్ము క‌శ్మీర్‌కు చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ – రూ.50 లక్షలు బాండ్ల రూపంలో సొమ్ము చేసుకుంది.