వివేకా భార్య సంచలన వీడియో

“మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. అయితే, ఈ విష‌యం మేం గ్ర‌హించ‌లేక పోయాం” అని దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ తాజాగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. వివేకానంద‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించార‌ని.. త‌ర్వాత ప‌క్క‌కు పెట్టేశార‌ని ఆమె తెలిపారు. అయితే.. ఇలా జ‌రుగుతుంద‌ని కానీ, ఇలా చేస్తార‌ని కానీ.. తాము ఊహించ‌లేక పోయామ‌ని సౌభాగ్య‌మ్మ వ్యాఖ్యానించారు.

“ఎవ‌రెవ‌రి మ‌న‌సులో ఏముందో గ్ర‌హించ‌లేక‌పోయాం. కానీ, చాలా బాధేస్తుంది. మా ఇంట్లోనే మాకు శ‌త్రు వులు ఉన్నారంటే!” అని సౌభాగ్య‌మ్మ తెలిపారు. గ‌త 2019 మార్చి 15న వివేకానంద‌రెడ్డిని ఆయ‌న ఇంట్లోనే దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. దీనిని తొలుత గుండె పోటుగా ప్ర‌చారం చేశారు. త‌ర్వాత‌.. ఇది దారుణ హ‌త్య అని తెలిసింది. అంతేకాదు.. దీని వెనుక ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డిల పాత్ర ఉంద‌ని సీబీఐ అధికారులు కూడా తేల్చారు.

అంతేకాదు.. అనేక సంద‌ర్భాల్లో ఎంపీ అవినాష్‌ను విచారించారు. ఇక‌, ఆయ‌న బెయిల్ తెచ్చుకుని బ‌య‌ట తిరుగుతున్నారు. ఇదిలావుంటే, ఈ కేసులో స‌హ‌క‌రించాల‌ని వివేకా కుటుంబం.. సీఎం జ‌గ‌న్‌ను అభ్య‌ర్థించిన విష‌యం తెలిసిందే. సొంత చిన్నాన్న కావ‌డంతో ఆయ‌న స‌హ‌క‌రిస్తార‌ని ఆశ‌లు కూడా పెట్టుకుంది. కానీ, ఆయ‌న నిందితుల‌ను కాపాడుతున్నార‌నే వాద‌న వివేకా కుటుంబానికి చాలా లేటుగా తెలిసిన‌ట్టు ఇటీవ‌ల వివేకా కుమార్తె సునీత కూడా ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని జ‌గ‌న్ అన్న ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. ఈ కేసులో నిందితుడు ఫ‌లానా వ్య‌క్తి అని తెలిసి(ఎంపీ అవినాష్) కూడా జ‌గ‌న్ త‌ప్పించుకున్నార‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగాఅంద‌రూ క‌లిసి త‌న తండ్రిని దారుణంగా చంపేశార‌ని సునీత వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె ప్ర‌స్తుతం న్యాయ‌పోరాటం చేస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లుగా మీడియా ముందుకు రాని సౌభాగ్య‌మ్మ‌.. వివేకా ఐదో వ‌ర్థంతి నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇంట్లోనే త‌మ‌కు శ‌త్రువులు ఉన్నార‌ని ప‌రోక్షంగా పలువురిని ఉద్దేశించి వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.