10 వేల కోట్లు ఇచ్చాం , 12 స్థానాలు గెలిపించండి

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో 12 చోట్ల బీజేపీ గెలిచి తీరాల‌ని ఆ పార్టీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా టార్గెట్ నిర్దేశించారు. మీరు వెళ్లండి. ఇంటింటికీ త‌లుపు త‌ట్టండి. ప్ర‌జ‌ల‌ను క‌ల‌వండి. ఇంకేమైనా చేయండి. 12 స్థానాలు మ‌నకు వ‌చ్చేలా చేయండి – అని అమిత్‌షా పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ బీజేపీని తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం అని అన్నారు.

ఏప్రిల్‌, మేలో జరిగే ఎన్నికలతో మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తుందని షా ధీమా వ్య‌క్తం చేశారు. అలాగ‌ని తిని కూర్చోవ‌ద్ద‌ని, టీవీల్లో డిబేట్ల‌కు ప‌రిమితం కావ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. మ‌న గురించి చాలా క‌బుర్లు చెబుతారు. ఇంకేముంది.. వ‌స్తున్నామంటారు. నిజ‌మే కానీ, అలాగ‌ని ప‌నిమానేయొద్దు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌వండి. మోడీ మాట‌గా.. అంద‌రినీ బీజేపీ వైపు మ‌ళ్లించండి అని షా చెప్పారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. అవినీతి రహిత భారత్‌ నిర్మాణమే బీజేపీ లక్ష్యమ‌ని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్, మజ్లిస్‌ మూడూ అవినీతి పార్టీలే అని షా విమర్శించారు. ప్రధాని మోడీ గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పార్టీ సోషల్ మీడియా వాలంటీర్లకు పిలుపు ఇచ్చారు. వాస్తవాలు వివరించేందుకు సోషల్ మీడియా వాలంటీర్లు కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. మూడోసారి కూడా నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా చూడాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీకి వెకేషన్ కి వెళ్తారని ఎద్దేవా చేశారు.

10 వేల కోట్లు ఇచ్చాం

గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 వేల కోట్ల రూపాయిలు సాయం చేశామ‌ని అమిత్ షా చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం మూడు పార్టీలు బీఆర్ఎస్ – కాంగ్రెస్ – ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయన్నారు. ఆ మూడు అవినీతి పార్టీలే అని.. మోడీని ఓడించడమే ఆ పార్టీల ఏకైక లక్ష్యమ‌ని దుయ్య‌బ‌ట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలని విమ‌ర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌ అవినీతి జాబితా పంపిస్తా. వాటికి కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పాకే మాపై విమర్శలు చేయాలి అని స‌వాల్ రువ్వారు.