లేఖ సూత్రధారుడి పదవీ పీకేసిన సోనియమ్మ

నాయకుడు ఎంత తోపు అయినప్పటికీ.. పార్టీకి విధేయుడిగా.. నమ్మకస్తుడిగా ఉండాలి. ఏదేదో చేయాలన్న ఆలోచన ఉండొచ్చు. కానీ.. అదంతా అధినేత మనసును దోచుకునేలా ఉండాలే కానీ గాయపరిచేలా ఉండకూడదు.

మొన్నా మధ్య కాంగ్రెస్ పార్టీలో తాత్కాలిక అధ్యక్షుల ఎంపికను పక్కన పెట్టటం.. పార్టీ పగ్గాల అప్పగింతకు ఎన్నికలు నిర్వహించాలన్న షాకింగ్ ప్రపోజల్ తో పాటు పలు సంచలన అంశాలతో కూడిన లేఖను విడుదల చేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ లేఖకు కారణమైన వారిపై గాంధీ ఫ్యామిలీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. తాజాగా పార్టీని ప్రక్షాళన చేసే నిర్ణయాల్ని వరుస పెట్టి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సీనియర్లను పక్కన పెట్టేసి.. రాహుల్ టీంకు పగ్గాలు అప్పజెప్పాలన్న ఆలోచనను తాజాగా అమలు చేశారు. పార్టీకి చెందిన పదవుల్ని రాహుల్ టీంకు చెందిన నేతలకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏఐసీసీలో ఎంతోకాలంగా పాగా వేసిన పలువురు సీనియర్లను తాజాగా సాగనంపుతూ నిర్నయం తీసుకున్నారు. ఎన్నోఏళ్లుగా పార్టీ కీలక పదవుల్లో ఉన్న గులాంనబీ అజాద్ ను పక్కన పెట్టేశారు. సుదీర్ఘ కాలంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఇంచార్జ్ గా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన్ను పక్కన పెట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల లేఖ ఎపిసోడ్ లో కీలకభూమిక పోషించిన ఆయనపై చర్యలు తీసుకోవటమే కాదు.. పలువురు సీనియర్లను పదవులు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లేఖ రాసినందుకు సారీ చెప్పిన నేతలు జితిన్ ప్రసాద్.. ముకుల్ వాస్నిక్ కు పదోన్నతులు కల్పించటం గమనార్హం. కొత్తగా పదవులు పొందిన వారంతా రాహుల్ టీంకు చెందిన వారు కావటం గమనార్హం. తాజా నిర్ణయంతో కాంగ్రెస్ లో కొత్త శకం మొదలైందని చెప్పక తప్పదు.

లేఖ రాసిన వారిపై తనకు శత్రుత్వం.. ద్వేషం లేదని చెప్పిన సోనియమ్మ.. తాజాగా లేఖ కలకలాన్నిరేపిన గులాం నబీ అజాద్ తో పాటు.. దానిపై సంతకం పెట్టిన పలువురిని పక్కన పెట్టేయటం చూస్తే.. కాంగ్రెస్ మార్క్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. గులాం విషయంలో వేటు తప్పదన్న అంచనాలు మొదట్నించి వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే తాజా నిర్ణయం వెలువడింది. మరి..దీనిపై గులాం నబీ మౌనంగా ఉంటారా? కొత్త రచ్చను షురూ చేస్తారా? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.