ఫ్యామిలి ప్యాక్ గోల పెరిగిపోతోందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ లో టికెట్ల కోసం బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాల కారణంగా టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోతోంది. ఇందులో కూడా ఫ్యామిలీ మెంటర్లకు టికెట్లు కావాలంటు సీనియర్ల నుండి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. చాలామంది సీనియర్లకు ఢిల్లీలోని కీలకనేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరికివారుగా తమ కుటుంబసభ్యలకు టికెట్లు ఇప్పించుకునేందుకు లాబీయింగ్ పెంచేస్తున్నారు.

ఇలాంటి లాబీయింగ్ లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మరికొందరు చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గడ్డంవివేక్ లాంటి వాళ్ళు కూడా రేసులో దూసుకుపోతున్నారు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లాంటి నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ అంతకంతుకు పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మూడునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనాల్లో సానుకూలత ఉండటం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో నాలుగింటిని అమల్లోకి తెచ్చింది.

100 రోజుల్లోనే సిక్స్ గ్యాంరెటీస్ అమల్లోకి తెస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అయితే అదంతా ఈజీకాదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఖజనా దాదాపు ఒట్టిపోయిన స్ధితిలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ముందు ఆదాయవనరులను పెంచుకోవటం, ఖర్చులు తగ్గించుకోవటం లాంటి వాటిపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టింది. దీనికి అదనంగా కేసీయార్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపైన కూడా దృష్టిపెట్టింది. కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి సాగునీటి ప్రాజెక్టుల గోల ఉండనే ఉంది.

ఇలాంటి పరిస్ధితుల్లో మొదటి వందరోజుల్లోనే నాలుగు హామీలను అమల్లోకి తేవటం గొప్ప విషయమనే చెప్పాలి. కాకపోతే ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీస్ ను అమలుచేయలేకపోవటం ఫెయిల్యూరనే చెప్పాలి. అమలుచేయాల్సిన రెండు హామీలపై రేవంత్ క్లారిటి ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో సానుకూలతైతే ఉంది. కష్టపడితే గెలిచిపోతామన్న నమ్మకం ఉండబట్టే టికెట్ల కోసం డిమాండ్ బాగా పెరిగిపోతోంది. మరి ఫ్యామిలీప్యాకుల గోల ఏమవుతుందో చూడాలి.