మోడీ ప్ర‌సంగాల‌కు ‘ఏఐ’ మెరుపులు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌సంగాల‌కు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలెన్స్‌(ఏఐ)తో మెరుపులు మెరిపించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌క్షిణాది రాష్ట్రాలే కేంద్రంగా ఈ ప్ర‌యోగానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. వాస్త‌వానికి ఏఐ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సందేహాలు, అను మానాలు.. విమ‌ర్శ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. ఏఐతో మంచి ప‌నులు కూడా చేయొచ్చ‌నేది నిర్ధార‌ణ అయిన అంశమే తాజాగా ఒత్తిడిని గుర్తించే ఏఐ టూల్ అందుబాటులోకి వ‌చ్చింది. అదేవిధంగా ఏఐని వినియోగించి బ్యాంకు లావాదేవీల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండే టూల్స్ కూడా అందుబాటులోకి వ‌చ్చాయి.

సో.. ఏఐ అనేది మ‌నం వినియోగించుకునే విధానాన్ని బ‌ట్టే ఆధార‌ప‌డి ఉంటుంద‌నేది స్ప‌ష్ట‌మైంది. ఇప్పుడు తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యంలో బీజేపీ ఏఐపై క‌న్నేసింది. ఏఐని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన ప్ర‌సంగాల‌ను అప్ప‌టిక‌ప్పుడే.. స్థానిక భాష‌ల్లో అనువించ‌నున్నారు. అంటే.. వేరే ఎవ‌రూ అనువ‌దించిన‌ట్టుగా ఉండ‌దు.. స్క్రీన్‌పై ప్ర‌ధాని స్వ‌చ్ఛంగా స‌ద‌రు స్థానిక భాష‌లోనే మాట్లాడిన‌ట్టుగా ఏఐ స‌ద‌రు ప్ర‌సంగాల‌ను త‌ర్జుమా చేస్తుంది. ఎక్క‌డా చిన్న లోపం లేకుండా.. స‌ద‌రు ప్రాంతీయ భాష‌లో ఎలాంటి ఉచ్ఛార‌ణ లోపాలు రాకుండాకూడా ఏఐ అప్ర‌మత్తంగా ఉంటుంది.

ఏంటి లాభం?

ప్ర‌స్తుతం బీజేపీకి ఉత్త‌రాదిన మంచి ప్ర‌భావ‌మే ఉంది. దీనికి కార‌ణం మాట‌ల మాంత్రికుడుగా ప్ర‌ధాని మోడీ పేరు తెచ్చుకోవ‌డ‌మే. ఆయ‌న చెప్పే హిందీ ప్ర‌సంగాలు ఉత్త‌రాది వారిని అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. త‌ద్వారా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా చేరువ‌య్యారు. అదే ద‌క్షిణాదిని తీసుకుంటే.. భాషా ప‌ర‌మైన ఇబ్బంది.. ప్ర‌ధాని మోడీకి-ద‌క్షిణాదిలోని ఏపీ, తెలంగాణ‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఒడిశా త‌దిత‌ర రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు త‌ట‌స్థంగా ఉంచింది.

ఆయ‌న ఎక్క‌డైనా ప్ర‌సంగాలు చేసినా.. వాటిని ఇత‌ర నేత‌లు త‌ర్జుమా చేసినా.. మ‌క్కీకి మ‌క్కీ.. మోడీ చెప్పిన‌ట్టు.. మ‌న‌సును హ‌త్తుకునేట్టు ఉండ‌వు. దీంతో ఓటు బ్యాంకు బీజేపీకి చేరువ కాలేక పోతోంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏఐ సాయంతో మోడీ ప్ర‌సంగాల‌ను త‌క్ష‌ణం స్థానిక భాష‌ల్లోకి త‌ర్జుమా చేసి.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని క‌మ‌ల నాథులు ప్లాన్ చేశారు. ఇదీ.. సంగతి!!