తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ సందేహం వచ్చింది. ఇటీవల ఆయన.. స్వయంగా వర్షాల కోసం వరుణ యాగం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. దీనికి సంబంధించి నాగార్జున సాగర్ చెంతనే ఉన్న విజయ్ విహార్లో ఏర్పాట్లు కూడా చేశారు. సోమవారం రిత్విక్కులు.. వరుణ యాగం క్రతువును కూడా ప్రారంభించారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. తొలి పూజలో వారే పాల్గొని ప్రారంభం చేశారు. ఈ క్రతువు సోమవారం సాయంత్రం వరకు జరగనుంది.
చివరిలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు.. అలానే మంత్రులు కూడా హాజరు కానున్నారు. అయితే.. ఇంతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అనూహ్యమైన సందేహం వచ్చింది. భారత వాతావరణ కేంద్రం ఇప్పటికే వర్షాలు తగ్గుముఖం పట్టాయని.. రుతుపవనసీజన్ కూడా అయిపో యిందని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గినట్టేనన్న సమాచారం అందింది. ఈ విషయాన్ని తెలంగాణ వాతావరణ విభాగం ఆదివారం ప్రకటించింది. వర్షాభావ ప్రాంతాలపై నివేదికను కూడా సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో భారీగా వర్షాలు కురవాలని కోరుతూ.. వరుణ యాగం నిర్వహించడంపై సీఎం రేవంత్ సందేహం వ్యక్తం చేశారు. ఒకవైపు వాతావరణ కేంద్రం అంతా అయిపోయిందని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు యాగం ద్వారా వర్షాలు కురుస్తాయా? అని ఆయన అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే..వారు ఏమీ చెప్పలేదు. మరోవైపు.. గతంలో కేసీఆర్ యాగాలు చేసినప్పుడు.. “మంత్రాలతో చింతకాయలు రాలుతాయా?” అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ వీడియోలను బీఆర్ఎస్ ప్రచారంలోకి తీసుకువచ్చింది. ఈ పరిణామాలతో సీఎం సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.
ఏపీలోనూ..
మరోవైపు.. ఏపీలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఎల్నినో ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంటలు నష్టపోవ డం తో పలు దేవాలయాల్లో ప్రభుత్వం వరుణ యాగాలు, వరుణ జపాలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ అధికారంలో ఉండి ఉంటే.. ఈ సమస్య వచ్చేది కాదని అంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో వర్షాలు సమృద్దిగా కురిశాయని, ఇప్పుడు యాగాలు చేసుకుని కురిపించే పరిస్థితి వచ్చిందని.. పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates