సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి విద్యార్థుల సెగ‌.. కేంద్రం మౌనం!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అంటే.. రాష్ట్ర‌ప‌తి త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి అంత‌టి పోస్టు. ఈ ప‌ద‌వికి అనేక మంది వ‌న్నె తెచ్చారు. అదేస‌మ‌యంలో త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన ఒక‌రిద్ద‌రు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఇప్పుడు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న‌.. జ‌స్టిస్ సూర్యకాంత్‌.. కూడా అంత‌కు మించి అన్న‌ట్టుగా వివాదాల్లో కూరుకుపోతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయ‌న విద్యార్థుల‌ను, వారి ఉద్య‌మాల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు.. తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యాయి.

మ‌రోవైపు.. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా.. ప్ర‌ధాన న్యాయ‌మూర్తులకు పరోక్షంగా అండ‌గా నిలిచిన సంద‌ర్భా లు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు అండ‌గానే ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత‌.. జస్టిస్ సూర్య కాంత్ విష‌యంలో మౌనంగా ఉండిపోతోంది. దీనికి కార‌ణం.. కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టిన కాక్రోచ్ జ‌నతా పార్టీ పుట్టుక‌కు ఆయ‌న చేసిన కామెంట్లే కార‌ణ‌మ‌ని కేంద్రం భావిస్తోంది. “యువ‌త బొద్దింక‌లుగా, ప‌రాన్న‌జీవులుగా మారి వ్య‌వ‌స్థ‌ల‌పై దాడి చేస్తున్నారు” అన్న ఒకే ఒక్క‌మాట నుంచి కాక్రోచ్ జ‌నతా పార్టీ ఆవిర్భ‌వించింది.

అనంత‌రం.. నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారాన్ని భుజాల‌పై వేసుకున్న ఈ పార్టీ.. దేశ‌వ్యాప్త ఉద్య‌మం చేసి.. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వ‌ర‌కు ప‌ట్టుబ‌ట్టింది. ఈ ప‌రిణామాలు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఇబ్బందిగా మారాయి. ఇక‌, ఆ త‌ర్వాత అయినా.. ఆయ‌నలో మార్పు క‌నిపించిన‌ట్టు లేద‌ని కొంద‌రు న్యాయ‌వాదులు ఆరోపించారు. ఢిల్లీలో పోలీసులు విద్యార్థుల‌ను చిత‌క బాదారంటూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను అత్యవ‌స‌రంగా విచారించాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌స్టిస్ సూర్య‌కాంత్ తేల్చేశారు. అంతేకాదు.. వారిపై పోలీసులు చేసిన దాడుల‌కు సంబంధించిన వీడియోలు చూసే స‌మ‌యం త‌మ‌కు లేద‌న్నారు.

ఈ ప‌రిణామాల‌తో విద్యార్థి లోకం పూర్తిగా చీఫ్ జస్టిస్ కు వ్య‌తిరేకంగా మారిపోయింది. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించేందుకు రెడీ కావ‌డం గ‌మ‌నార్హం. ప్రారంభంలో.. ఆయ‌న పాల్గొనే కార్య‌క్ర‌మాల‌ను బాయికాట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ న్యాయ విశ్వ‌విద్యాల‌యం నిర్వ‌హించే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి సీజేఐను ముఖ్య అతిథిగా పిలవొద్దంటూ యాజమాన్యానికి 450 మంది విద్యార్థులు లేఖలు రాశారు. జంతర్ మంతర్ నిరసనల్లో విద్యార్థులపై దాడిపై ఆయనకు పట్టింపు లేదంటూ లేఖలో విద్యార్థుల ఆవేదన వ్య‌క్తం చేశారు.

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడి గురించి విచారించే సమయంలో, విద్యార్థులపై దాడి జరిగిన వీడియోలు చూసే టైమ్ లేదని, “థ్యాంక్ యూ వెరీ మచ్” అంటూ విద్యార్థుల తరఫు న్యాయవాదితో వెటకారంగా మాట్లాడారంటూ విద్యార్థుల లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీ అందుకోవడం తమ విలువలకు విరుద్ధమని, కాబట్టి సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా పిలవకండి అంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ నెల‌ 2వ తేదీన సీజేఐ జ‌స్టిస్‌ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా జరగాల్సిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్నాతకోత్సవం ఉన్నపళంగా రద్దు అయింది. దీనికి కూడా సీజేఐ పట్ల విద్యార్థుల అసంతృప్తే కారణమని తెలుస్తోంది. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. కేంద్రం మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజాగా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న విష‌యంలో సీజేఐ ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.