బీఆర్ఎస్ కు ఎంఎల్ఏ షాకిచ్చినట్లేనా ?

బీఆర్ఎస్ కు ఒక ఎంఎల్ఏ షాకిచ్చినట్లేనా ? ఇపుడిదే అంశంపై పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కేసీయార్, కేటీయార్ ఆధ్వర్యంలో జరిగిన రెండు సమావేశాలకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు హాజరుకాలేదు. బీఆర్ఎస్ మీటింగులకు తెల్లం హాజరుకాకపోగా మధ్యలో రేవంత్ రెడ్డిని కలిశారు. దాంతో తెల్లం తొందరలోనే కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. తెల్లం మాత్రం తాను నియోజకవర్గం డెవలెప్మెంట్ కు నిధుల అడిగేందుకు మాత్రమే కలిశానని చెబుతున్నారు.

ముఖ్యమంత్రిని ఎవరు ఎందుకు కలిసినా చెప్పేది మాత్రం ముందు నియోజకవర్గం అభివృద్ది కోసమనే చెబుతారు. తర్వాత జరిగే డెవలప్మెంట్లలోనే సడెన్ గా పార్టీ మారిపోతారు. ఈ విషయాన్ని జనాలు గడచిన పదేళ్ళుగా చాలాసార్లు చూశారు. ఇక్కడ విషయం విషయం ఏమిటంటే తెల్లం వెకటరావు మొదటినుండి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కీలక మద్దతుదారుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలంలో పోటీచేసేందుకు తెల్లంకు పొంగులేటి కోటాలో టికెట్ రాలేదు.

దాంతో చివరి నిముషంలో తెల్లం బీఆర్ఎస్ అగ్రనేతలతో మాట్లాడుకుని కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లోకి దూకేశారు. టికెట్ తెచ్చుకోవటమే కాకుండా గెలిచారు కూడా. విచిత్రం ఏమిటంటే ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రచారంచేసిన కేసీయార్ ఒక్క భద్రాచలంలో మాత్రం ప్రచారం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రచారం చేసినా టైం వేస్తు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని అనుకున్నారట. అంటే భద్రాచలంలో ఎటూ బీఆర్ఎస్ గెలవదు కాబట్టి ప్రచారంకు సమయం కేటాయించటం కూడా వృధానే అనుకున్నారట.

అయితే ఖమ్మం జిల్లాలో కేసీయార్ ప్రచారం చేసిన తొమ్మిది నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులు ఓడిపోయారు. ప్రచారం అనవసరమని కేసీయార్ వదిలేసిన భద్రాచలంలో మాత్రమే పార్టీ అభ్యర్ధి తెల్లం గెలిచారు. అప్పటినుండి తెల్లం ఏదోరోజు కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయమని అందరు అనుకుంటునే ఉన్నారు. ఎందుకంటే మంత్రి పొంగులేటికి తెల్లం ప్రధాన మద్దతుదారుడు కావటమే. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ రెండు మీటింగులకు తెల్లం గైర్హాజరవ్వటం, ఇదే సమయంలో రేవంత్ రెడ్డితో భేటీ కావటంతో అందరిలోను తెల్లంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.