ఏపీ స‌చివాల‌యం తాక‌ట్టు.. బాబు రియాక్ష‌న్ ఇదే!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్ర స‌చివాల‌య్యాన్ని రూ.370 కోట్ల అప్పు కోసం తాక‌ట్టు పెట్ట‌డాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇంత‌క‌న్నా త‌ప్పుడు ప‌ని, దుర్మార్గం మ‌రొక‌టి లేద‌ని పేర్కొ న్నారు. ఇది రాష్ట్రానికి అత్యంత‌ అవమానకరమని పేర్కొన్నారు.

‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.  

“రాష్ట్రానికి ఎంత అవమానకరం…ఎంత బాధాకరం…ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు….తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా…అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!“ అని సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

నారా లోకేష్ కామెంట్స్‌

గత ఐదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని రూ.12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్‌.. ఇప్పుడు ఏకంగా సచివాలయాన్ని తాకట్టుపెట్టారన్న వార్త చూసి షాక్‌కు గురైనట్లు తెలిపారు.

‘‘ఏపీని అప్పుల కుప్పగా చేసి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని మేమంటే ఒంటికాలిపై లేచిన వైసీపీ మేధావులు దీనికేం సమాధానం చెబుతారు? ఏపీ సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక ఆ దేశంతో కూడా పోల్చడం ఏ మాత్రం సరికాదని అనిపిస్తోంది. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదు“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.