అసమ్మతి నేతలను బీజేపీ పట్టించుకోలేదా ?

తెలంగాణాలో విడుదలైన బీజేపీ ఎంపీ అభ్యర్ధుల మొదటిజాబితాను చూసిన తర్వాత ఇదే విషయం అర్ధమవుతోంది. మొదటిజాబితాలో పార్టీ అగ్రనేతలు తొమ్మిది స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. సికింద్రాబాద్ నుండి కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్ కు టికెట్లు దక్కాయి. వీరుముగ్గురు ప్రస్తుతం పై నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగో స్ధానం ఆదిలాబాద్ లో ఎంపీ సోయం బాబూరావు పేరను ప్రకటించకుండా పెండింగులో ఉంచారు.

మరి బాబూరావుకు టికెట్ ఇస్తారా లేకపోతే కొత్తవారిని పోటీచేయిస్తారా అన్నవిషయంలో సస్పెన్సు కంటిన్యు అవుతోంది. ఇక మల్కాజ్ గిరి నుండి ఈటల రాజేందర్, జహీరాబాద్ నుండి బీబీ పాటిల్, హైదరాబాద్ నుండి డాక్టర్ మాధవీలత, చేవెళ్ళ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుండి పి. భరత్, భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్ పోటీచేయబోతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే టికెట్ హామీతో బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చిన నాగర్ కర్నూలు ఎంపీ పి. రాములుకు టికెట్ ఇవ్వలేదు. రాములుకు బదులు భరత్ కు ఇచ్చారు.

ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఎంతమంది నేతలు వద్దని చెప్పినా మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ కు అగ్రనేతలు టికెట్ ప్రకటించటం. మల్కాజ్ గిరి టికెట్ కోసం చాడ సురేష్ రెడ్డి, కొమరయ్య, మురళీధరరావు, శ్రీశైలం గౌడ్ లాంటి చాలామంది నేతలు గట్టిగా ప్రయత్నించుకున్నారు. వీళ్ళందరు కూడా తమ ప్రయత్నాలకు మద్దతుగా లోకల్స్ కే టికెట్ ఇవ్వాలనే కోరస్ డిమాండ్ ను అగ్రనేతలకు వినిపించారు.

వీళ్ళల్లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా అగ్రనేతలు మాత్రం ఈటలకే టికెట్ ప్రకటించారు. టికెట్ దక్కే విషయంలో అనుమానంతోనే గౌడ్ కాంగ్రెస్ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా, ఎంత ఒత్తిళ్ళు తెచ్చినా ఎలాంటి ఉపయోగాలు లేకుండా పోయాయి. మరి ఇంతమందిని కాదని టికెట్ తెచ్చుకున్న ఈటలకు స్ధానిక నేతలు ఏమేరకు సహకరిస్తారన్నది అనుమానమే.