మంగళగిరిలో కీలకమైన మార్పు

రాబోయే ఎన్నికలకు సంబంధించి పోటీచేయబోయే అభ్యర్ధులతో జగన్మోహన్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల జాబితాను రిలీజ్ చేశారు. ఇందులో రెండుపేర్లు చాలా ఇంట్రెస్టింగుగా ఉన్నాయి. అవేమిటంటే నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇన్చార్జిగా లావణ్యను ప్రకటించటం. విజయసాయిరెడ్డి పేరు తెరమీదకు రావటం అనూహ్యమనే అనుకోవాలి. ఇక్కడ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరుతున్నారు. అందుకనే కొత్తగా అభ్యర్ధిని దింపాల్సొచ్చింది వైసీపీకి. అనేక రకాల సర్వేలు, కాంబినేషన్లను ఆలోచించిన తర్వాత విజయసాయి పేరును పార్టీ ప్రకటించింది.

ఇక్కడ నుండి విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారడ్డి ఎంపీగా పోటీచేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఏమైందో తెలీదు సడెన్ గా విజయసాయి పేరు ప్రకటించారు. మరి ఇది ఫైనలేనా లేకపోతే చివరినిముషంలో మార్చేస్తారా అన్నది సస్పెన్సుగానే ఉంది. ఒకవేళ విజయసాయే అభ్యర్ధి అయినా గట్టి క్యాండిడేట్ అనే అనుకోవాలి. ఒకవేళ చివరినిముషంలో శరత్ పేరు ఖాయమైతే మరింత స్ట్రాంగ్ అనుకోవాలి. ఎందుకంటే ఆర్ధికంగా, రాజకీయంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారు శరత్. కాకపోతే ఆయనపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుంది. ఒంగోలులో టీడీపీ తరపున పోటీచేయబోతున్న మాగంట రాఘవరెడ్డి కూడా ఇదే కేసులో ఇరుక్కున్నారు.

ఇక మంగళగిరి విషయం తీసుకుంటే మురుగుడు లావణ్య రాజకీయాలకు కొత్త. అయితే ఆమె బలమైన రాజకీయ నేపధ్యమున్న కుటుంబాల నుండే ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె తల్లి కాండ్రు కమల మాజీ ఎంఎల్ఏ. లావణ్య మామగారు మురుగుడు హనుమంతరావు కూడా మాజీ ఎంఎల్ఏనే. లావణ్య గనుక అభ్యర్ధి అయితే అన్నీవైపుల నుండి ఆమెకు మద్దతు ఉంటుందనే అనుకుంటున్నారు. మహిళ, యూత్ కాబట్టి జనాల్లోకి స్పీడుగా చొచ్చుకు పోగలదని జగన్ అనుకునుండచ్చు.

అయితే ఈమె టీడీపీ తరపున పోటీచేయబోతున్న నారా లోకేష్ ను ఢీకొనాల్సుంటుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ రాబోయే ఎన్నికల్లో గెలిచితీరాలని పట్టుదలగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ భవిష్యత్తే ఇబ్బందులో పడుతుంది. కాబట్టి ఆ పరిస్ధితి రాకుండా ఉండాలంటే లోకేష్ కచ్చితంగా గెలిచితీరాల్సిందే. కాబట్టి వచ్చేఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ముఖ్యమైనదనే చెప్పాలి.