టీడీపీలోకి బిగ్ షాట్స్

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో నేతల పార్టీ దూకుళ్ళు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే టీడీపీలోకి కొందరు బిగ్ షాట్స్ చేరబోతున్నారు. శనివారం వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతున్నారు. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా చేరబోతున్నారు. ఇపుడు పార్టీలో చేరుతున్న, చేరబోతున్న వారందరికి మళ్ళీ అవే స్ధానాల్లో టికెట్లు ఇవ్వటానికి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం.

ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బదులు ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి పోటీచేయబోతున్నారు. వీళ్ళు కాకుండా ఇప్పటికే పెనమలూరు ఎంఎల్ఏ కొలుసు పార్ధసారధి టీడీపీలో చేరి నూజివీడు నుండి టికెట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే మరో ఇద్దరు ఎంఎల్ఏలు రక్షణనిధి, కైలే అనీల్ కుమార్ కూడా టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీళ్ళకి టికెట్ల హామీ దక్కలేదు కాబట్టే చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

తొందరలోనే ఇంకెంతమంది టీడీపీలో చేరటానికి రెడీ అవుతున్నారో తెలీదు. మొత్తానికి వైసీపీలో నుండి టీడీపీలో చేరుతున్న నేతల వల్ల పార్టీకి ఎంతోకొంత ఉపయోగం అయితే ఉంటుందనే అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే వేమిరెడ్డి, లావు, మాగుంట ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారని అందరికీ తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోతున్న వీళ్ళు తమ ఖర్చులను పెట్టుకుంటునే ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఖర్చులను కూడా చాలా తేలిగ్గా భరించగలరు. ఇలాంటి ఆర్ధికంగా స్ధితిమంతుల అవసరం ప్రతిపార్టీకి ఉంటుందనటంలో సందేహంలేదు.

పోయిన ఎన్నికల్లో వీళ్ళంతా వైసీపీని ఆర్ధికంగా ఆదుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే నేతలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా పార్టీని ఆదుకుంటారనటంలో సందేహంలేదు. ఇలాంటి అభ్యర్ధులు పార్టీల గెలుపోటములను కొంతవరకు ప్రభావితం చేయగలరు. టీడీపీలో ఇలాంటి నేతలకు దక్కే ఆదరణను బట్టి వైసీపీ నుండి ఇంకెంతమంది నేతలు, అసంతృప్తనేతలు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఏదేమైనా వైసీపీని వదిలేసి బిగ్ షాట్స్ టీడీపీలోకి చేరటం అన్నది డెఫనెట్ గా అడ్వాంటేజ్ అనే చెప్పాలి.