దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఉమ సన్నిహితంగా ఉండడం, చంద్రబాబు ఆదేశాలు బేఖాతరు చేసి వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడంపై టీడీపీ హై కమాండ్ సీరియస్ అయింది.
ఈ క్రమంలోనే ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్ లతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీని కలిసి బోండా ఉమ వివరణనిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇకపై వైసీపీ నేతలు హాజరయ్యే కార్యక్రమాలకు తాను హాజరు కాబోనని బోండా ఉమ స్పష్టం చేశారు. తాను పాతికేళ్లుగా పార్టీలో ఉన్నానని, ఏనాడూ పార్టీ లైన్ దాటలేదని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ధిక్కరించేలా ఏరోజూ ప్రవర్తించలేదని, ప్రవర్తించబోనని చెప్పారు. 2019-24 మధ్యకాలంలో ప్రాణాలొడ్డి పార్టీని కాపాడుకునేందుకు ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసని, అందుకు మీడియా కూడా సాక్షి అని చెప్పారు.
ముద్రగడ సంస్మరణ సభ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తన దగ్గరకు వచ్చి పలకరించారని, మాట్లాడుకున్నామని అన్నారు. అది వాస్తవమేనని, బహిరంగ వేదికపైనే జరిగిందని చెప్పారు. కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారని, తనను ఆహ్వానించారు కాబట్టి అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటు వేదికను పంచుకోవాల్సి వచ్చిందని వివరణనిచ్చారు.
కానీ, ఆ విషయం గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిందని, ట్రోలింగ్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించారని, అక్కడ జరిగిన కలయిక వేరని చెప్పారు. ఈ విషయమే కమిటీ ముందు వివరించానని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
