కురుక్షేత్ర యుద్ధంలో మీరు ఎటు వైపు?

మ‌రికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జ‌ర‌గ‌బోతోంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. ఈ యుద్ధంలో మీరు(మ‌హిళ‌లు) ఎటువైపు నిల‌బ‌డుతున్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు. రాజ‌కీయంగా రాష్ట్రాన్ని నాశ‌నం చేసిన వైసీపీ వైపు నిల‌బ‌డితే.. మీ కు భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. చంద్ర‌బాబు కోసం నిల‌బ‌డితే.. మీ పిల్ల‌ల భ‌విత‌వ్యం బంగారు బాట ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు.

నిజం గెలవాలి పేరుతో నారా భువ‌నేశ్వ‌రి యాత్ర‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. గత ఏడాది జ‌రిగిన‌ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తలను ఆమె సముదాయించి, ఓదార్చుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఒక్కొక్క కుటుంబానికీ రూ.3 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆమె అన‌కాప‌ల్లి జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా బాధిత కుటుంబాలు.. కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శించి ఆర్థిక సాయం అందించారు. ఇక‌, ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన రోజు నుంచి అనే క‌ అరాచకాలు పెరిగిపోతున్నాయని అన్నారు. టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, పోలీసులు కొడుతు న్నార‌ని.. కేసులు పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2019కి ముందు ఏపీ అంటే.. అభివృద్ధికి చిరునామాగా మంచి పేరు ఉంద‌న్నారు.

కానీ, ఇప్పుడు ఏపీ పేరు గంజాయికి మారుపేరుగా మారింద‌ని వ్యాఖ్యానించారు. కల్తీ మద్యం, ఇసుక మాఫియా గుర్తుకొస్తున్నాయన్నారు. మన దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలని మ‌హిళ‌ల‌ను తాను కోరుతున్నాన‌ని చెప్పారు. వ‌చ్చేది కురుక్షేత్ర యుద్ధం.. మీరంతా చంద్ర‌బాబుకు మ‌ద్దతుగా నిల‌వాలి. ఇప్ప‌టి క‌న్నా.. మీకు ఎక్కువ‌గానే సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తారు అని నారా భువ‌నేశ్వ‌రి వ్యాఖ్యానించారు.