‘డైమండ్ రాణి.. పులుసు పాప‌’

ఏపీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై సినీ నిర్మాత‌.. తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ నేత బండ్ల గ‌ణేష్ తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘డైమండ్ రాణి-పులుసుపాప‌’- అంటూ ఆయ‌న కామెంట్లు చేశారు. “రోజా డైమండ్ రాణి.. పులుసు పాప‌.. ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్” అన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు చేప‌ల పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అయ్యార‌ని.. దీనిలో త‌ప్పేముంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేపోమాపో మాజీ అయ్యాక ఇక్కడికి వచ్చి జబర్దస్త్ ప్రొగ్రామ్‌లు చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిని అనే స్థాయి రోజాకు లేదన్నారు. రోజా ఐటం రాణి అని బండ్లగణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక‌, సీఎం జ‌గ‌న్ గురించికూడా.. బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. “రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు. సీఎం జగనే యాక్సిడెంటల్ సీఎం. రేవంత్ రెడ్డి పోరాటం చేసిన యోధుడు, ఫైటర్ . భారతదేశంలో రేవంత్ రెడ్డిలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. పోరాడి, కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకుని ముఖ్యమంత్రి. నాన్న చనిపోతేనే, నాన్న వారసత్వంతోనే సీఎం అయితే యాక్సిడెంటల్ సీఎం అంటారు” అని గ‌ణేష్ చుర‌క‌లు అంటించారు.

ఎందుకీ వివాదం?

ఇటీవల ఏపీలో మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అని విమర్శించారు. సందర్భం లేకపోయినా రేవంత్ రెడ్డిని విమర్శించడంతో.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని బండ్ల గణేష్ రోజాపై విరుచుకుపడ్డారు. గతంలోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనూ బండ్ గణేష్ రోజాతో పలుమార్లు వాగ్వాదానికి దిగారు. శృతి మించి విమర్శలు చేసుకున్నారు.