తెలంగాణపై మోడీ ఎన్నిక‌ల వ‌రాలు

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ‌పై కేంద్రంలోని బీజేపీ అవ్యాజ‌మైన ప్రేమ‌ను కురిపిస్తోం ది. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. వంద‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు ఇక్క‌డ శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణలో 15 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు ఆయ‌న శంకు స్థాప‌న‌లు చేయ‌నున్నారు. వీటి విలువ రూ.230 కోట్లకుపైగానే ఉండ‌నుంది. వీటికి సోమ‌వారం(రేపు) ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను కేంద్ర ప్ర‌భుత్వం నిర్మించనుంది. రూ.221.18 కోట్ల వ్య‌యంతో ఇప్ప‌టికే పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించ‌నున్నారు. అదేవిధంగా 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయ‌నున్నారు. దీనికి సంబంధించి రైల్వేశాఖ మొత్తం 2,245 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ ప్రాజెక్టులు ప్రారంభం అవుతుండ‌డం గ‌మ‌నార్హం. 2023, ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ.894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అయితే.. ఇవ‌న్నీ కూడా.. ప‌క్కాగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

10 స్తానాల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది బీజేపీ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బ‌ల‌మైన పోటీ ఇవ్వాల‌ని భావిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పార్టీకి తెలంగాణ న‌లుగురు ఎంపీలు ఉన్నారు. అయితే, ఈ సంఖ్య‌ను 10కి చేర్చ‌డం ద్వారా 2028లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ద‌క్కించుకోవాల‌న్నది.. బీజేపీ ఎత్తుగ‌డ‌. ఈ క్ర‌మంలోనే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయ‌డం గ‌మ‌నార్హం.