100 నుంచి 150 సీట్ల‌లో కాంగ్రెస్ ఒంట‌రి గెలుపు : క‌నుగోలు

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ నేత‌లు.. 370-400 సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకుంటామని ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. దీంతో మొత్తంగా ఉన్న పార్ల‌మెంటు సీట్ల‌ను చూస్తే.. 543 స్థానాల‌కు గాను .. బీజేపీనే 400 త‌న ఖాతాలో వేసుకుంటే..(ఎన్డీయే మిత్ర‌ప‌క్షాలు) మిగిలిన 143 సీట్లు మాత్ర‌మే మిగులుతాయి. వీటిలో ప్రాంతీయ పార్టీలైన తృణ‌మూల్‌, ఆప్‌, వైసీపీ, బీజేడీ, జేయూడీ, ఎస్పీ వంటివి ఉన్నాయి. ఇవి త‌లా 10 చొప్పున విజ‌యంద‌క్కించుకున్నా.. మిగిలేవి 60 నుంచి 80 సీట్లు మాత్ర‌మే. అవి కూడా కాంగ్రెస్‌కు ద‌క్క‌కుండా చేయాల‌నేది బీజేపీ ప్లాన్‌.

ఇదే జ‌రిగితే.. ఇక‌, కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ రంగంలొకి దిగింది. పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న సునీల్ క‌నుగోలు ద్వారా దేశ‌వ్యాప్తంగా స‌ర్వే చేయించిన‌ట్టు తెలిసింది. మొత్తం 260 లోక్‌స‌భ స్థానాల్లో సునీల్ క‌నుగోలు బృందం స‌ర్వే చేసింది. అనేక రూపాల్లో ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన స‌ర్వే ఫ‌లితాల‌ను విశ్లేషించి తాజాగా నివేదిక అందించింద‌ని తెలిసింది. దీని ప్ర‌కారం.. దేశంలో కాంగ్రెస్ ఒంట‌రిగా పోటీ చేసినా.. 100 నుంచి 150 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌గ‌ట్టిన‌ట్టు తెలిసింది. ఇది ఒక‌ర‌కంగా.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైలురాయిగానే భావించాలి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం 43 స్థానాల‌కే ప‌రిమిత‌మైన పార్టీకి ఇప్పుడు 100 -150 స్తానాలంటే.. అతి పెద్ద సంఖ్యే న‌ని చెప్పాలి.

ఇక‌, ఈ స‌ర్వేలో చిత్ర‌మైన విష‌యం తెర‌మీద‌కి వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ గ‌త కొన్నేళ్లుగా సంప్ర‌దాయం పేరుతో పార్టీ టికెట్ల‌ను సిట్టింగుల‌కే ఇవ్వ‌డం.. లేదా వంశ‌పారంప‌ర్యంగా వాటిని కేటాయించ‌డం తెలిసిందే. ఈ సారి మాత్రం అలా చేయ‌డానికి వీల్లేద‌ని సునీల్ క‌నుగోలు ఇచ్చిన‌ నివేదిక‌లో పేర్కొన్నారు. సిట్టింగుల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల‌ని.. వారి సామ‌ర్థ్యం, ప్ర‌జ‌ల్లో ఉన్న ప‌లుకుబ‌డి.. వారి అభిలాష వంటివాటిని అంచనా వేయాల‌ని ఈ నివేదిక‌లో సునీల్ క‌నుగోలు కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక, మోడీ ప్ర‌భావం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ ఒంట‌రిపోరుతో 150 సీట్లు క‌నుక ద‌క్కించుకోగ‌లిగితే.. మిత్ర‌ప‌క్షాల‌ను క‌లుపుకొని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే ప‌రిస్థితి వుండే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.