10 రోజుల్లో 2 సార్లు ముప్పు తప్పినా.. మూడోసారి ఘోరం!

అయ్యో అనిపించేలా జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) దుర్మరణం పాలు కావటం తెలిసిందే. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన ఆమె తన తండ్రి సాయన్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తరచూ ఏదో ఒక ప్రమాదానికి గురి కావటం.. అంతలోనే సేఫ్ గా బయటపడే లాస్య నందిత ఈసారి మాత్రం ప్రమాదం నుంచి బయటపడలేక ప్రాణాలు విడిచిన విషాదం అందరిని నిర్ఘాంతపోయేలా చేస్తోంది.

గడిచిన పది రోజుల వ్యవధిలో ఆమె రెండు ప్రమాదాల నుంచి ముప్పు ఎదుర్కొన్నారు. అయితే.. ఈ రెండింటి నుంచి క్షేమంగా బయటపడిన ఆమె.. ఈ తెల్లవారుజామున జరిగిన మూడో ప్రమాదంలో మాత్రం ప్రాణాల్ని కోల్పోయారు. పది రోజుల్లో మొదటి ప్రమాదం లిఫ్టులో ఇరుక్కుపోయారు. అందులో నుంచి క్షేమంగా బయటపడిన ఆమె.. రోజుల వ్యవధిలోనే నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ సభకు హాజరై తిరిగి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో హోంగార్డు మరణించగా.. ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం ఆమె ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్.. ఆమె క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 12న జరిగిన రెండో ప్రమాదం అనంతరం పది రోజుల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా చూస్తే.. ఆమె డ్రైవర్ సీటు పక్కన కూర్చోలేదని.. వెనుక సీట్లో కూర్చున్నట్లు చెబుతున్నారు. సడన్ బ్రేక్ వేయటంతో ఆమె తల బలంగా ముందు సీటుకు ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. మెడ భాగంలోనూ.. తల ప్రాంతంలో తగిలిన తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించారు.

దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికి ఫిబ్రవరి కలిసి రావట్లేదంటారు. గత ఏడాది ఫిబ్రవరి 19న సాయన్న కన్నుమూశారు. తాజాగా ఆయన కుమార్తె లాస్య నందిత ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడవటం నోట మాట రాకుండా చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎ మ్మెల్యే లాస్య నందిత మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆయన.. ఆమె అకాల మరణం బాధాకరమని.. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సైతం ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.