ప్రియాంకా, రాహుల్, రేవంత్ లకు డెత్ డిక్లరేషన్: కేటీఆర్

కొలువులు అడిగితే యువ‌త‌ను పోలీసుల‌తో కొట్టిస్తున్నార‌ని.. కాంగ్రెస్‌కు డెత్ డిక్ల‌రేష‌న్ రాసే స‌మ‌యం వ‌చ్చింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌రూర్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన యువ సంగ్రా మ స‌ద‌స్సు(స‌భ‌)లో ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కు అధికార పీఠం ద‌క్కితే..యువ‌త‌కు బ‌లిపీఠం వేశార‌ని ఆయ‌న ఆరోపించారు. కాంగ్రెస్ హ‌యాంలో ఎలాంటి నోటిఫికేష‌న్‌లు రావ‌ని.. కేవ‌లం లూటిఫికేష‌న్ల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో కాంగ్రెస్ ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం పెద్ద బూట‌క‌మ‌ని కేటీఆర్ ఆరోపించారు. గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వం చేసిన మంచిని కూడా త‌న ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. జిత్తుల మారి కాంగ్రెస్ ముస‌లిన‌క్క యువ‌త‌ను మోసం చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్‌కు డెగ్ డిక్ల‌రేష‌న్ రాసిన‌ప్పుడే సోయి(మెళ‌కువ‌) వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. జాబు క్యాలెండ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి జేబులు నింపుకొనే క్యాలెండ‌ర్ల‌ను తీసుకువ‌చ్చార‌ని ఆరోపించారు.

ఎన్నిక‌ల‌కు ముందు స్కూటీలు ఇస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ నాయ‌కులు.. అధికారంలోకి వ‌చ్చాక లూటీలు చేస్తున్నా ర‌ని కేటీఆర్ పేర్కొన్నారు. జోన‌ల్ విధానం తీసుకువ‌చ్చిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని తెలిపారు. ఆయ‌న దీని కోసం రెండేళ్ల‌పాటు క‌ష్ట‌ప‌డ్డార‌ని తెలిపారు. అయితే.. ఆనాటి ప్ర‌భుత్వంలోనూ కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను తామే గుర్తించి నిలుపుద‌ల చేశామ‌ని తెలిపారు. ఉద్యోగాలు అడిగిన ఉద్యోగుల‌ను ఆనాడు వారి స‌మ‌స్య‌లు వినేందుకు స‌మ‌యం ఇచ్చామ‌న్నారు.

కానీ, ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన యువ‌త‌ను ఉరికించి మ‌రీ కొడుతున్నార‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెబుతున్న రేవంత్ రెడ్డి.. దీనిని నిరూపిస్తే.. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని కేటీఆర్ స‌వాల్ రువ్వారు. లోపాల‌ను ఎత్తి చూపితే.. ప్ర‌భుత్వ‌పెద్ద‌ల‌కు కోపం వ‌స్తోంద‌ని.. కానీ, ఆనాడు లోపాల‌ను ఎత్తి చూపితే.. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వాటిని స‌రిచేసుకుంద‌ని చెప్పారు. ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో లెక్క‌! అని వ్యాఖ్యానించారు. కాగా.. యువ స‌భ‌కు భారీ ఎత్తున బీఆర్ ఎస్ విద్యార్థి, యువ జ‌న విభాగం కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌చ్చారు.