వైసీపీకి వచ్చేది తక్కువ… పోయేది ఎక్కువ!

వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు ప‌డిపోయింది. దీనికి కార‌ణాలు ఏంటన్న‌వి అంద‌రికీ తెలిసినా.. వైసీపీకి మాత్రం ఇంకా బోధ‌ప‌డలేదు. దీంతో ఇటు పార్టీలోను, అటు నాయ‌కుల్లోనూ మార్పు క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న ఉంది. వాస్త‌వానికి ప్ర‌జాస్వామ్యంలో గెలుపు ఓట‌ములు కామనే అయినా.. కార‌ణాలు తెలుసుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం పార్టీల‌పై ఉంటుంది. వాటిని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

ఏం చేస్తున్నారు.. ?

ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త లేదా పుట్ట‌బోయే వ్య‌తిరేక‌త త‌మ‌కు మేలు చేస్తుంద‌ని వైసీపీ నాయకులు అంచ‌నా వేసుకుంటున్నారు. వాస్త‌వానికి ఇది పార్టీ అధిష్టానంలోనే ఉంది. అందుకే క్షేత్ర‌స్థాయి నాయ‌కులు కూడా అదే దారిలో న‌డుస్తున్నారు. దీంతో వైసీపీలో స‌రైన దిశానిర్దేశం లేకుండానే నాయ‌కులు ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఫ‌లితంగా పార్టీ పుంజుకునే విష‌యంలో ఇంకా వెనుక బ‌డే ఉంద‌న్న‌ది వాస్త‌వం.

ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో పార్టీకి భారీ ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వైఖ‌రి పార్టీకి క‌లిసి రాక‌పోగా.. వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. దీనిని స‌రిచేయాల్సి పార్టీ అధిష్టానం కూడా మౌనంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతా నేత‌లే చూసుకుంటారులే అనే ధోర‌ణి అవలంభించడంతో ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంద‌న్న‌ది పార్టీకి తెలిసినా.. నాయ‌కుల‌కు ఎలాంటి దిశానిర్దేశం చేయ‌డం లేదు. ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర‌లో కేవ‌లం నలుగురైదుగురు నాయ‌కులు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నారు.

సీమ‌లో కూడా కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు నేత‌లు మాత్ర‌మే వాయిస్ వినిపిస్తున్నారు. ఇక‌, ఉభ‌య గోదావ‌రి, ఉమ్మ‌డి కృష్ణాలో ఒక‌రిద్ద‌రు కూడా త‌క్కువ‌గానే ఉన్నారు. గుంటూరులో అయితే.. అంబ‌టి రాంబాబు కేంద్రంగానే వైసీపీ రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇలా.. చేయ‌డం వ‌ల్ల పార్టీప‌రంగా వ‌చ్చే ఇమేజ్ మాట ఎలా ఉన్నా.. పోతున్న ఇమేజే ఎక్కువ‌గా ఉంది. దీంతో రాజ‌కీయంగా వైసీపీ పుంజుకోవ‌డం కూడా క‌ష్ట‌మేన‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తంగా ఈ రెండేళ్ల‌లో పార్టీ పెద్ద‌గా పుంజుకున్న‌ది అయితే లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.