బుల్లెట్ రైలుకు `రాజకీయ` రెడ్ సిగ్న‌ల్‌?!

తెలంగాణకు కీల‌క ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీల‌కంగా మార‌నుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌-విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌-చెన్నై, హైద‌రాబాద్‌-ముంబైల మ‌ధ్య ఈ రైళ్లు ప్ర‌యాణించ‌నున్నాయి. అంతేకాదు.. ఒకే రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైళ్ల‌ను ప్ర‌క‌టించ‌డం కూడా విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైళ్ల‌ను ప్ర‌క‌టించ‌లేదు. అలాంటిది వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బుల్లెట్ రైళ్ల‌ను కేంద్రం అనుగ్ర‌హించింద‌న్న వాద‌న ఉంది.

ఇక, ఈ వ్య‌వ‌హారాన్నిరాజ‌కీయ కోణంలో కాకుండా.. రాష్ట్ర అభివృద్ధి కోణంలో చూడాల‌ని ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యానికి రాజ‌కీయాల‌పై మాట్లాడుకుందామ‌ని.. అప్ప‌టి వ‌ర‌కు అభివృద్ధిపైనే దృష్టి పెడ‌తామ‌ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సో.. మొత్తంగా ఈ ప్రాజెక్టు రాక‌తో.. తాను కీల‌కంగా భావిస్తున్న ఫ్యూచ‌ర్ సిటీకి మ‌రింత ప్రాభ‌వం పెరుగుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయాల‌కు అతీతంగా ఆయ‌న ప్ర‌య‌త్నాలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భూ సేక‌ర‌ణ‌కు నడుం బిగించారు.

ఇదిలావుంటే.. బుల్లెట్ రైలు మార్గాలు నిర్మించే ప్రాంతాల్లో చేప‌డుతున్న భూ సేక‌ర‌ణ పెను వివాదంగా మారుతోంది. సాధార‌ణంగా భూముల‌తో రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు ఉండే అనుబంధం నేప‌థ్యంలో సేక‌ర‌ణ‌కు స‌హ‌క‌రించ‌ని ప‌రిస్థితి అన్నిచోట్లా ఉంటుంది. అయితే.. తెలంగాణ‌లో ముఖ్యంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుల‌కు సంబంధించి జ‌రుగుతున్న భూసేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌జ‌లు తిరుగుబాటు చేస్తున్నారు. అనూహ్య‌మైన దాడి మార్గాల‌ను వారు ఎంచుకుంటున్నారు. దీని వెనుక బ‌ల‌మైన రాజ‌కీయ ప్రోద్బ‌లం.. మ‌ద్ద‌తు కూడా ప్ర‌జ‌ల‌కు ల‌భిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

తాజాగా బ‌హదూర్‌పుర‌లో పోలీసుల క‌ళ్లలో కారం కొట్టిన ఘ‌ట‌న , వారిపై రాళ్లు రువ్విన ఘ‌ట‌నల వెనుక ఓ జాతీయ పార్టీ నాయ‌కుల ప్రమేయం ఉంద‌ని పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో స్థానికంగా ఆపార్టీ నాయ‌కులు కూడా పాల్గొన్న‌ట్టు చెబుతున్నారు. ఇక‌, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కొంద‌రు కూడా ఈ ఆందోళ‌న‌లో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. మొత్తంగా భూ సేక‌ర‌ణ విష‌యంలో.. ముఖ్యంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుల విష‌యంలో రాజ‌కీయంగానే ఇబ్బందులు వ‌స్తున్నాయ‌న్న చ‌ర్చ కొన్నాళ్లుగా సీఎం నోటి నుంచే వినిపిస్తోంది. తాజాగా ఇది ఆధారాల‌తో స‌హా వెలుగు చూస్తోంద‌ని పోలీసులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.