ఏపీలో రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు?

రేవంత్ రెడ్డి షెడ్యూల్ రెడీ అయ్యిందా ? తెలంగాణా సీఎం రేవంత్ షెడ్యూల్ ఇపుడు రెడీ అవటం ఏమిటి ? ముందుగానే రెడీ అయిపోతుంది కదాని అనుమానం వచ్చిందా ? షెడ్యూల్ సిద్ధమైంది తెలంగాణాలో కాదు ఏపీలో. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయటానికి ఏపీలో రేవంత్ షెడ్యూల్ ను ఏపీ కాంగ్రెస్ రెడీ చేసిందట. మొదటి బహిరంగసభ ఈనెల 25వ తేదీన  తిరుపతి జిల్లాలో జరగబోతోంది. దీనికి రేవంత్ తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరవ్వబోతున్నారట.

తిరుపతి జిల్లా సభ తర్వాత కృష్ణాజిల్లా, పశ్చిమగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా పర్యటించబోతున్నారని సమాచారం. తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరగబోతున్నాయి. అదే ఏపీలో ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాలి. అందుకనే ఏపీ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ బాగా ఇంట్రెస్టు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వామపక్షాల నేతలతో కలిసి రేవంత్ బహిరంగసభలు కొన్ని రోడ్డుషోల్లో పాల్గొనే అవకాశముందని సమాచారం.

రేవంత్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేయటం అంటే జగన్మోహన్ రెడ్డిని డైరెక్టుగా ఎటాక్ చేయటమే అన్న విషయంలో ఎవరికీ అనుమానంలేదు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధితో పాటు ఏపీ చీఫ్ షర్మిలకు కూడా జగన్ కామన్ శతృవైపోయారు. అందుకనే అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి షర్మిల పదేపదే జగన్నే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి రేవంత్ టార్గెట్ కూడా ఎవరనే విషయంలో క్లారిటి ఉంది.

కాకపోతే ఏ విషయాల్లో జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు ? ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు అన్నదే పాయింట్. జగన్ను తెలంగాణా సీఎం వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తే ఎలాంటి ఉపయోగముండదు. పాలసీల ఆధారంగా టార్గెట్ చేస్తేనే జనాలు ఆలోచిస్తారు. అయితే రేవంత్ టచ్ చేసే పాలసీలు ఏపీకి నష్టదాయకమని జనాలు కన్విన్స్ అవ్వాలి. మొన్నటి తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రయోజనాల రక్షణకు జగన్ ఏమిచేశారనే విషయాన్ని స్వయంగా రేవంత్, మంత్రులే చెప్పారు. కేసీయార్ ను టార్గెట్ చేసే క్రమంలో రేవంత్ అండ్ కో జగన్ ను హీరోని చేశారు. మరిపుడు రేవంత్ ఏ విధంగా టార్గెట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.