పవన్ తో పొత్తు..జగన్ పై ఒక‌చేయి, చంద్రబాబుపై మరో చేయి!

రీజనల్ పార్టీలను అడ్డం పెట్టుకుని ఏపీలో పాగా వేయాలని బీజేపీ చూస్తోందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. పవన్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ… జగన్ పై ఒక‌చేయి, చంద్రబాబు పై మరో చేయి వేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంతో బీజేపీ మూడు ముక్కులాట ఆడుతోందని విమర్శించారు. బాబు, జగన్, పవన్ లకు ఓటు వేస్తే మోడీకి వేసినట్లేనని అన్నారు. ఈ నెల 26న ఖర్గే, మాణిక్ ఠాకూర్, షర్మిల అనంతపురం సభలో పాల్గొంటారని, ఆ తర్వాత పొత్తుల అంశంపై ఒక స్పష్టత వస్తుందని చెప్పారు.

చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే రిటర్నింగ్ అధికారి 8 బ్యాలెట్ పేపర్లను చెల్లవని ప్రకటించారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓట్ల రీకౌంటింగ్ కు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై కూడా రుద్రరాజు స్పందించారు. ఆ తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తోందని, పదేళ్లుగా ఈడీ వంటి సంస్థలను మోడీ తన గుప్పిట్లో పెట్టుకుని నిర్వీర్యం చేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు.

బీజేపీ జాతీయ స్థాయి సమావేశాల్లో రాముడు, మోడీ నామస్మరణ మాత్రమే చేశారని, రాముడితో మోడీ, అమిత్ షా, ఇతర నేతలకు ఎక్కడైనా పోలిక ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పాటు, అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బీజేపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టి‌ ప్రభుత్వాలను కూలగొట్టడం, లేదంటే సిబిఐ, ఈడీ వంటి వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం చేస్తున్నారని ఆరోపించారు.