పల్నాడులో పట్టుకోసం కొత్త స్కెచ్

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు నాయుడు కొత్త స్కెచ్ ను రెడీచేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యూహాలను రచిస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కొత్త, గట్టి అభ్యర్ధులను చంద్రబాబు పోటీలోకి దింపబోతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పోయిన ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటుతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను టీడీపీ ఓడిపోయింది. పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే కచ్చితంగా అన్ని సీట్లు గెలవాల్సిందే అన్నది చంద్రబాబు టార్గెట్.

ఇందులో బాగంగానే వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును టీడీపీలో చేర్చుకుంటున్నారు. టీడీపీ తరపున లావే ఎంపీ అభ్యర్ధిగా పోటీచేయటం ఖాయం. మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులను కాదని రేపటి ఎన్నికలకు గట్టి నేతలను రంగంలోకి దింపబోతున్నారు. మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డిని అభ్యర్ధిగా చాలాకాలం క్రితమే ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో గడచిన నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిచిందిలేదు.

అలాగే నరసరావుపేటలో కూడా 20 ఏళ్ళుగా టీడీపీ జెండా ఎగరలేదు. ఒకపుడు నియోజకవర్గంలో ఎంతో పట్టుసాధించిన కోడెల శివప్రసాద్ ఇమేజి తర్వాత మసకబారిపోయింది. ఆయన చనిపోవటంతో ఇక్కడ గట్టి నేత పార్టీకి దొరకటంలేదు. ఇపుడు ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ అరవింద్ బాబునే అభ్యర్ధిగా ప్రకటించే అవకాశముందని అనుకుంటున్నారు. అయితే సడెన్ గా వైసీపీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలోకి జాయిన్ అవబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. దాంతో ఇక్కడ టికెట్ ఎవరికన్న విషయంలో గందరగోళం మొదలైంది.

ఇక గురజాల, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో మాజీ ఎంఎల్ఏలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావే పోటీచేసే అవకాశాలున్నాయి. పెదకూరపాడులో మాజీ ఎంఎల్ఏ కొమ్మాలపాటి శ్రీధర్ కు టికెట్ లేదని చంద్రబాబు చెప్పేశారట. ఇక్కడ నుండి ఎవరినుండి పోటీలోకి దింపుతారో స్పష్టతలేదు. ఇక్కడినుండి భాష్యం ప్రవీణ్ పోటీచేసే అవకాశముందని అనుకుంటున్నారు. ఈ విధంగా రాబోయేఎన్నికల్లో గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపి అన్నీ సీట్లు లేకపోతే మెజారిటి సీట్లను గెలుచుకుని పూర్వవైభవాన్ని తీసుకురావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.