చంద్ర‌బాబు ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు యాగాలు, య‌జ్ఞాల బాట ప‌ట్టారు. గ‌త ఏడాది ఆయ‌న ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో ప్ర‌త్యేక య‌జ్ఞాలు జ‌రిపించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో జైలు నుంచి బ‌య‌ట‌కువ‌చ్చిన త‌ర్వాత‌.. పండితుల సూచ‌న‌ల మేర‌కు వీటిని నిర్వ‌హించారు. అయితే.. రాష్ట్ర‌శ్రేయస్సు కోసం నిర్వ‌హించామ‌ని.. స్వ‌యంగా చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రి దంప‌తులు వెల్ల‌డించారు. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు.. అత్యంత శ‌క్తిమాన్విత‌మ‌ని చెప్పే రాజ‌శ్యామ‌ల యాగాన్ని ప్రారంభించారు. ఈ యాగం నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.

రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌ల నుంచి ప్ర‌త్యేకంగా పిలిపించిన పురోహితుల‌తో ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా చంద్ర‌బాబు దంప‌తులు ప్రారంభించారు. మంగ‌ళ‌వాద్య ఘోష న‌డుమ‌.. గుమ్మ‌డికాయ కొట్టి ఈ యాగాన్ని చంద్ర‌బాబు స్వ‌యంగా ప్రారంభించారు. నివాసంలోనే అతి పెద్ద రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. అధికారం, ఆరోగ్యం స‌హా.. స‌క‌ల భోగాల‌ను కాంక్షిస్తూ.. ఈ యాగం చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ అధికారంలోకి రావాల‌ని ఆకాంక్షిస్తూ.. విశాఖ‌లోని శార‌దాపీఠం అధిప‌తి.. స్వ‌రూపానందేంద్ర ఈ యాగాన్ని జ‌గ‌న్ చేతుల మీదుగా జ‌రిపించారు.

అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా.. గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ యాగం నిర్వ‌హించారు. అయితే.. ఆయ‌న అధికారం ద‌క్కించుకో లేక పోయారు. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు వంతు వ‌చ్చింది. మ‌రి ఆయ‌న కోరిక ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. ఇదిలావుంటే.. రాష్ట్రంలోని 150స్థానాల్లో టీడీపీ పోటీ చేయ‌నున్న‌ట్టు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. జ‌న‌సేన‌కు 25 సీట్లు కేటాయిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మేర‌కు ప్రాథ‌మికంగా.. చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.