టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌.. క్యూ క‌ట్టిన వైసీపీ నేత‌లు

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో వైసీపీ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునే కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రం చేసింది. అయితే… ఇక్క‌డ ఓడౌట్ రావొచ్చు. బుధ‌వారమే.. పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడిన చంద్ర బాబు, ఇక‌, వైసీపీ నేత‌ల‌ను చేర్చుకునేది లేద‌ని తెగేసి చెప్పారు. అంతేకాదు.. చాలా మంది ట‌చ్‌లో ఉన్నార‌ని.. కానీ, వారిలో కొంద‌రికి మాత్ర‌మే అవ‌కాశం ఇస్తామ‌ని తేల్చి చెప్పారు. ఇలా.. ఆ కొంద‌రితోనే తాజాగా చంద్ర‌బాబు భేటీ అయ్యారు. వీరు కూడా ఎక్కువ మందే ఉండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీలో టికెట్ల వ్య‌వ‌హారం ఇప్ప‌టికే క‌న్ఫ్యూజ‌న్‌గా మారింది. దీంతో కొత్త వారిని చేర్చుకుంటే ఇబ్బందులు మ‌రింత‌గా పెరిగే ఛాన్స్ ఉంద‌ని చంద్ర‌బాబు కూడా గ‌మ‌నించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కొత్త వారికి అవ‌కాశం ఇవ్వరాద‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇప్ప‌టికే మాట ఇచ్చిన వారిని తాజాగా ఉండ‌వల్లి లోని తన ఇంటికి ఆహ్వానించిన చంద్ర‌బాబు.. వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. వీరిలో న‌ర‌స‌రావుపేట ఎంపీ.. వైసీపీ నాయకుడు(ఇటీవ‌ల రాజీనామా చేశారు) లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు.. ఉన్నారు.

చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తాజాగా భేటీ అయ్యారు. టీడీపీలో చేరితే ఆయ‌నకు సిట్టింగ్ పేట టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో క‌లిసి చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. న‌ర‌స‌రావుపేట ప‌రిధిలోకి వ‌చ్చే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల విజ‌యాన్ని కూడా ఈయ‌న భుజాన వేసుకోవాల్సి ఉంటుంది. ఇది అన్నిపార్టీల్లోనూ ఉన్న విష‌య‌మే. దీనికి చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు.. వైసీపీ సీనియర్ నేత అట్లా చిన్న వెంకటరెడ్డి కూడా.. చంద్ర‌బాబు నివాసానికి చేరుకున్నారు. దాదాపు 100 కార్ల భారీ కాన్వాయ్‌తో వ‌చ్చారు. ఈయ‌న పార్టీలో టికెట్ ఆశిస్తున్నారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇచ్చినా గెలిచి గిఫ్ట్‌గా ఇస్తామ‌ని చెబుతున్నారు.

నూజివీడుపై స్పెష‌ల్ ఫోక‌స్‌..

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నూజివీడులో అభ్య‌ర్థి మార్పు ఖ‌రారైన ద‌రిమిలా.. ఇక్క‌డి టికెట్ ను ఆశించిన టీడీపీ ఇన్‌చార్జి ముద్ద‌ర‌బోయిన వెంకటేశ్వరరావును కూడా చంద్ర‌బాబు ఆహ్వానించారు. ఈ సారికి పార్టీకి స‌హ‌క‌రించాల‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. దీనికి ముద్ద‌ర‌బోయిన ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ నుంచి వైసీపీ నాయ‌కుడు.. ప్ర‌స్తుత పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసూఉ పార్థ‌సార‌థిని పార్టీ దాదాపు ఖ‌రారు చేసింది.