రైతులు ఢిల్లీకి.. మోడీ దుబాయ్‌కి!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 370 స్తానాల్లో ఒంట‌రిగానే గ‌ట్టెక్కుతామ‌ని.. ఆ సీట్లు సంపాయించుకోవ‌డం.. త‌మ‌కు అత్యంత తేలికైన విష‌య‌మ‌ని ప్ర‌ధాన మంత్రి ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ల‌క్ష్యానికి రైతుల రూపంలో సెగ ప్రారంభ‌మైంది. ఏకంగా.. మూడు రాష్ట్రాల‌కు చెందిన రైతులు.. ఢిల్లీలో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ప‌క్కా వ్యూహంతో రెడీ అయ్యారు. త‌మ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు.. ఏటా ఇస్తున్న కనీస మ‌ద్ద‌తు ధ‌ర‌లు.. ప్ర‌బుత్వాల ద‌యాదాక్షిణ్యాల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌ద‌నేది రైతులు చెబుతున్న వాద‌న‌.

క‌నీసం మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు.. చ‌ట్టం ప్ర‌కారం ఒక ర‌క్ష‌ణ ఏర్పాటు చేయాల‌నే ప్ర‌ధాన డిమాండ్ తో పంజాబ్‌, హ‌రియాణ‌, ఛండీగ‌ఢ్‌, యూపీ, బిహార్ స‌హా ప‌లు రాష్ట్రాల రైతులు.. ఢిల్లీలో క‌దం తొక్కేందుకు రెడీ అయ్యారు. అయితే.. వీరిని ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుని ఢిల్లీలో కి అడుగు పెట్ట‌కుండా చూసేందుకు .. మోడీ స‌ర్కారు ప‌క్కా ప్ర‌ణాళితో మిలిట‌రీని సైతం రంగం లోకి దించేందుకురెడీ అయింది. ఈ క్ర‌మంలోనే ఢిల్లీకి దారితీసే దాదాపు అన్ని ర‌హ‌దారుల‌ను దిగ్భంధం చేసింది. అయిన‌ప్ప‌టికీ.. రైతులు.. త‌మ డిమాండ్ల‌ను సాధించే వర‌కు వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని చెబుతున్నారు.

ఢిల్లీకి దారి తీసే అన్ని ప్రధాన మార్గాల్లో పోలీసులు బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడం వల్ల రాజ‌ధానిలోకి వెళ్లేందుకు రైతులు ఓ ప్రణాళికతో ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నా ఆందోళనలను సుదీర్ఘంగా కొనసాగించేందుకు రైతులు సిద్ధమైనట్టు పేర్కొన్నాయి. అందుకోసం 6 నెలలకు సరిపడా రేషన్‌, ప్రయాణానికి కావాల్సిన డీజిల్‌ను తెచ్చుకున్నట్టు తెలిసింది. గ‌తంలో మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునేవ‌ర‌కు ఏ విధంగా అయితే.. పోరాటం చేశారో..ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో ఉద్య‌మించేందుకు రెడీ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

విదేశాల‌కు మోడీ..

ఒక‌వైపు.. రైతులు ‘ఢిల్లీ చ‌లో’ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చినా.. త‌న‌కు ఏమాత్రం ప‌ట్ట‌ద‌న్న‌ట్టుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. మంగ‌ళ‌, బుధ‌వారాల్లో ఆయ‌న దుబాయ్‌లో ప‌ర్య‌టించ‌నున్నా రు. అక్క‌డ వివిధ కార్య‌క్ర‌మాల‌తోపాటు అతి పెద్ద హిందూ ఆల‌యాన్ని కూడా ఆయ‌న ప్రారంభించ‌ను న్నారు. మ‌రోవైపు.. ఢిల్లీని చేరుకుంటామ‌ని.. త‌మ ప్ర‌తాపం ఏంటో మోడీకి చూపిస్తామ‌ని రైతులు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. వీరిని అడ్డుకునేందుకు అవ‌స‌ర‌మైతే సైన్యాన్ని రంగంలోకి దింపుతామ‌ని కేంద్రం చెబుతోంది. ఈ నేప‌థ్య‌లో ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ నెల‌కొంది.