నేత‌లు జైలుకు వెళ్తే.. ఇంత సింప‌తీనా?

రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఏదో ఒక వివాదంలోనో.. అక్ర‌మాలు, అవినీతిలోనో చిక్కుకుని జైలు పాల‌వ‌డం ప‌రిపాటిగా మారిన విష‌యం తెలిసిందే. ఇలా.. జైలు పాలైన నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల్లో సింప‌తీ పెరుగుతుండడం కూడా తెలిసిందే. గ‌తంలో జైలుకు వెళ్లిన వారు.. త‌ర్వాత కాలంలో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ త‌ర‌హా జైలు సింప‌తీ అనేది కేవ‌లం మ‌న‌కే ప‌రిమితం కాలేదు. పొరుగు దేశం పాకిస్థాన్‌లోనూ క‌నిపించింది. అక్క‌డ కూడా జైలుకు వెళ్లిన నాయ‌కుడికి ప్ర‌జ‌లు జై కొట్టారు.

ఏం జ‌రిగింది?

తాజాగా పాకిస్థాన్‌లో గురువారం సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్ ఇ న్సాఫ్ పార్టీ(పీటీఐ) వ్య‌వ‌స్థాప‌కుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన నాయ‌కులు క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. పెను సంచ‌ల‌న‌మేన‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు.అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. పీటీఐ వ్య‌వ‌స్తాప‌కుడుగా ఉన్న ఇమ్రాన్‌.. ప్ర‌స్తుతం జైల్లో ఉన్నాడు. తోషా ఖానా(ప్ర‌ధానికి వ‌చ్చిన గిఫ్టుల‌ను అమ్ముకుని సొమ్ము చేసుకోవ‌డం) కేసు స‌హా తాజా పెళ్లి వివాదంతో ఆయ‌న‌, ఆయ‌న భార్య ఇద్ద‌రూ కూడా.. ఎ న్నిక‌ల‌కు రెండు రోజుల ముందు.. జైలుకు వెళ్లారు.

దీంతో అంద‌రూ ఇమ్రాన్ ప‌ని అయిపోయింద‌ని.. పార్టీ స‌హా ఆయ‌న కూడా.. చ‌రిత్ర‌లో క‌లిసి పోయిన‌ట్టేన ని అనుకున్నారు. దీనికి మ‌రో కార‌ణం.. ఇమ్రాన్ జైలు పాల‌వ‌డంతో ఎన్నిక‌ల సంఘం.. ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను గుండుగుత్త‌గా తిర‌స్క‌రించింది. దీంతో ఇక‌, పీటీఐ స‌హా.. ఇమ్రాన్ తెర‌మ‌రుగేన‌ని అనుకున్నారు. కానీ, జైల్లో ఉండి కూడా.. ఇమ్రాన్ చ‌క్రం తిప్పారు. త‌న పార్టీ నాయ‌కుల‌తో స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా నామినేష‌న్ వేయించారు. తాను జైల్లో ఉండే కొన్ని ఆడియోల‌ను పంపించారు.

అంతే..! సానుభూతి ప‌వ‌నాలు.. తుఫాను మాదిరిగా విరుచుకుప‌డ్డాయి. ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 61 స్థానాల్లో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొన‌సాగుతోంద‌ని శుక్ర‌వారం రాత్రికి ఎన్నిక‌ల సంఘం తెలిపింది. దీంతో మ‌రింత మంది గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మొత్తం పాకిస్థాన్ పార్ల‌మెంటులో 342 మంది స‌భ్యులు ఉంటారు. అయితే.. 266 స్థానాల‌కు మాత్ర‌మే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు.

మిగిలిన స్తానాల్లో 10 సీట్ల‌ను ముస్లిమేత‌ర మైనారిటీ వ‌ర్గాల‌కు రిజ‌ర్వ్ చేస్తారు. మ‌రో 60 సీట్ల‌ను అచ్చంగా మ‌హిళ‌ల‌కే కేటాయిస్తారు. వీరిని పార్టీలు సంఖ్యాప‌రంగా 5శాతం ఓట్ల‌తో నామినేట్ చేస్తాయి. సో.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే.. మేజిక్ ఫిగర్‌.. 135 సీట్లు ద‌క్కాల్సి ఉంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ త‌ర‌ఫున ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్య‌ర్థులు కీల‌క పాత్ర పోషించ‌డం ఖాయ‌మైంది.

మ‌రోవైపు మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ‘పీఎంఎల్‌-ఎన్‌’ పార్టీకి 43 సీట్లు, ‘పీపీపీ’కి 34 సీట్లు వచ్చాయి. దీంతో త‌మ‌దే అతిపెద్ద పార్టీ అని నవాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఈయ‌న ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇమ్రాన్ ఖాన్ మ‌ద్ద‌తు దారులు క‌ల‌వ‌కుండా.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇదెలా.. ఉన్న‌ప్ప‌టికీ.. పాకిస్థాన్‌లోనూ జైలు-సానుభూతి ఉంద‌నేది స్ప‌ష్ట‌మైంది.