వైసీపీని ఓడించేందుకు ‘ప్లాన్ బీ’ ఉంది: నాగ‌బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి విజ‌యం త‌థ్య‌మ‌ని.. రాసి పెట్టుకోవాల‌ని జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. న‌టుడు నాగ‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీని ఓడించేందుకు ఇప్పుడున్న వాటి కంటే.. కూడా వేరేగా ప్లాన్‌-బి ఉంద‌ని తెలిపారు. “వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా గెల‌వాలో మాకు తెలుసు. ప్లాన్ బీని తెర‌మీదికి తెస్తే.. వైసీపీ వాళ్లుఎవ్వ‌రూ మిగ‌ల‌రు” అని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌తో పాటు బీజేపీ కూడా క‌ల‌సి వ‌స్తే.. బాగుంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం విశాఖ పర్య‌ట‌న‌లో ఉన్న నాగ‌బాబు.. పార్టీకేడ‌ర్‌తో మాట్లాడుతున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? ఎలా ప్ర‌చారం చేయాల‌నే వ్యూహాల‌ను వారికి నూరిపోస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మీడియా మిత్రుల‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ విడుదల చేస్తున్న జాబితాలు చిత్తు కాయితాలుగా ఉన్నాయి. ఒక్కడు కూడా ప‌నికొచ్చే నాయ‌కుడు లేడు. వైసీపీ ఏడో జాబితా కాదు… లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదు” అని వ్యాఖ్యానించారు.

జ‌న‌సేన-టీడీపీ గెలిచేందుకు ప్లాన్ బి ఉంద‌న్నారు. అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో ఎన్నిచోట్ల పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు. పార్టీలో సమస్యలు ఎప్పుడూ ఉన్నాయ‌ని.. వాటిని ప‌రిష్క‌రించుకుంటామ‌ని వ్యాఖ్యానించారు. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వెల్ల‌డించ‌నున్న‌ట్టు నాగ‌బాబు చెప్పారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో జ‌న‌సేన అధినేత నిర్ణ‌యిస్తార‌ని తెలిపారు. ఎక్క‌డ‌నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కుతాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.