కోడిక‌త్తి శ్రీనుకు బెయిల్‌.. ష‌ర‌తులు విధించిన కోర్టు

సుదీర్ఘ విరామం.. అలుపెరుగ‌ని న్యాయ పోరాటం ద‌రిమిలా.. ‘కోడిక‌త్తి’ కేసులో నిందితుడుగా ఉన్న ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌న‌ప‌ల్లి శ్రీనివాస్ ఉర‌ఫ్ కోడిక‌త్తి శ్రీనుకు విశాఖ‌ప‌ట్నంలోని ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కొన్ని ష‌ర‌తులు విధించింది. కేసు పూర్వాప‌రాల‌పై ఎవ‌రితోనూ మాట్లాడ‌వ‌ద్దని.. మీడియాకు ఎలాంటి స‌మాచారం అందించ‌వ‌ద్ద‌ని ఆదేశించింది. అదేవిధంగా రాజ‌కీయ స‌భ‌లు, వేదిక‌లు, ప్ర‌చారాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్దేశించింది. దీంతో 2018 నుంచి జైల్లో మ‌గ్గుతున్న శ్రీనుకు ఊర‌ట ల‌భించిన‌ట్టు అయింది.

కేసు ఏంటి?

ప్ర‌స్తుతం ఏపీ సీఎంగా ఉన్న జ‌గ‌న్‌.. 2017 నుంచి ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న 2018 ఫిబ్ర‌వ‌రిలో విశాఖ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చి.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉండ‌డంతో ఆయ‌న విశాఖ విమానాశ్ర‌యానికి వ‌చ్చారు. విమానం ఆల‌స్యం కావ‌డంతో లాంజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న స‌మ‌యంలో కాఫీ ఇచ్చేందుకు వెళ్లిన శ్రీను.. ఆయ‌న పై కోడి పందేల్లో కోళ్ల‌కు క‌ట్టే క‌త్తితో దాడి చేశారు. దీంతో జ‌గ‌న్ భుజానికి గాయ‌మైంది. ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో రాజ‌కీయ దుమారానికి దారి తీసింది.

సీఎం జ‌గ‌న్‌పై హ‌త్యా య‌త్నం చేశార‌ని, దీని వెనుక అప్ప‌టి ప్ర‌భుత్వ పాత్ర కూడా ఉంద‌ని వైసీపీ నాయ‌కులు తీవ్ర ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలోనే కేసుపై సీబీఐ వేయాల‌ని.. కొన్ని రోజులు త‌ర్వాత‌.. ఎన్ ఐఏ కు అప్ప‌గించాల‌ని కొన్ని రోజులు వాద ప్ర‌తివాదాలు జ‌రిగాయి. ఈలోగా నిందితుడు శ్రీనును అరెస్టు చేసి.. జైలుకు త‌ర‌లించారు. అప్ప‌టి నుంచి శ్రీను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లోనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఎన్ ఐఏ(జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌) కేసు విచార‌ణ‌ను చేప‌ట్టింది.

శ్రీను దాడి వెనుక ఎలాంటి దురుద్దేశం లేద‌ని.. ఆయ‌న జ‌గ‌న్‌ను చంపాల‌నే ఉద్దేశం అస‌లే లేద‌ని ఎన్ ఐఏ త‌న విచార‌ణ‌లో తేల్చింది. ఇంత‌లోనే ప్ర‌భుత్వం మారి.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, దీనిలో ప్ర‌త్య‌క్ష సాక్షి.. గా సీఎం జ‌గ‌న్ ఉన్నార‌ని.. కాబ‌ట్టి ఆయ‌న‌ను విచారించాల‌ని ఎన్ ఐఏ కోర్టు కూడా ఆయ‌నకు స‌మ‌న్లు జారీ చేసింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ కోర్టుకు వెళ్ల‌లేదు. దీంతో శ్రీను జైల్లోనే మగ్గుతున్నారు. ఈ కేసుకు సంబంధించి శీను కుటుంబసభ్యులు అనేకమార్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి “మీరు సాక్ష్యం చెబితే.. మా బిడ్డ బ‌య‌ట‌కు వ‌స్తాడు” అని వేడుకున్నారు.

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఇలా.. ఏళ్లు గ‌డిచిపోయాయి. శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోయాడు. ఇక‌, ఈ ఏడాది ప్రారంభంలో త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ.. ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఇది న‌డుస్తూ ఉండ‌గానే.. శ్రీను త‌ల్లి, సోద‌రుడు నిరాహార దీక్ష‌కు దిగ‌డం.. విజ‌య‌వాడ‌లో పోలీసులు వారిని అరెస్టు చేయ‌డం తెలిసిందే. మ‌రోవైపు.. శ్రీను కూడా బెయిల్ కోరుతూ జైలులోనే దీక్ష చేశాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు జైలులోని అతనికి చికిత్సను అందించే ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా హైకోర్టు ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం.