రేవంత్‌.. నా ముందు నువ్వెంత‌? : కేసీఆర్ ఫైర్‌

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రేవంత్ నా ముందు నువ్వెంత‌? నీక‌న్నా ఉద్ధండుల‌నే చూసాను., నీక‌న్నా.. ఫైర్ బ్రాండ్ల ముందే ప‌నిచేశాను. నువ్వో ఫైరా!? అంటూ..కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ పార్టీ ముఖ్య నాయ‌కుల‌తో బేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ముందు సీఎం రేవంత్ వ్య‌వ‌హారం.. త‌ర్వాత‌.. కృష్నా ప్రాజెక్టుల‌ను కేంద్రానికి అప్ప‌గించే వ్య‌వ‌హారంపై ఒకింత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు.

ఇటీవ‌ల సీఎం రేవంత్ కేసీఆర్‌ను ఉద్దేశించి రండ‌.. అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ సీరియ‌స్ అయ్యారు. త‌న ముందు రేవంత్ చోటా నేత అంటూ.. వ్యాఖ్యానించారు. ఎంతో మంది ఉద్ధండుల‌నే ఎదిరించి.. తాను తెలంగాణ తెచ్చాన‌ని.. తాను ఉండ‌బ‌ట్టి.. ప‌దేళ్ల‌పాటు తెలంగాణ‌ను ర‌క్షించుకున్నామ‌న్నారు. ఇప్పుడు రేవంత్ కేంద్రం చేతికి రాష్ట్రాన్ని అప్ప‌గిస్తున్నార‌ని వ్యాఖ్యానించా రు. “కొత్త సీఎం న‌న్ను, బీఆర్ ఎస్‌ను విమ‌ర్శిస్తున్నారు. న‌న్ను, నా పార్టీని ట‌చ్ చేయ‌డం ఏ సీఎం వ‌ల్లా కాలేదు. తెలంగాణ విష‌యం కేసీఆర్ ఏ నాడూ వెన‌క్కి పోడు. రేవంత్ కంటే ఎంతో హేమాహేమీల‌నే ఎదుర్కొన్న చ‌రిత్ర మాది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇక‌, కృష్నాప్రాజెక్టుల విష‌యంపై మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌న ప్రాజెక్టుల‌పై పెత్త‌నం చేసేందుకు చూస్తోంద‌న్నారు. ఇలా కేంద్రానికి మ‌నం త‌లొగ్గితే.. రాష్ట్రం అడుక్కునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. గ‌తంలో తాము అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఒత్తిడి చేశార‌ని, అయినా.. ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్య‌మంత్రి రేవంత్ మాత్రం పిల్ల చేష్ట‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రేవంత్‌కు ప‌రిపాల‌న అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని… దీని వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు చెప్పాలని ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు.

పోయే వారు పోనీ..
పెద్ద‌ప‌ల్లి ఎంపీ వెంక‌టేశ్ పార్టీ వీడ‌డాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించారు. పోయే వారు పోనీ.. అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న‌వారికి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని అన్నారు. “ఆయ‌న‌కెవ‌రు చెప్పిన్రు టికెట్లు రావ‌ని. ఆయ‌న ఊహించుకున్న‌డు. ఆయ‌న వెళ్లిపోయింది. పోనీ” అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.