జగన్ పై బీజేపీకి ప్రేమ తగ్గలేదుగా

టీడీపీ చాలా సీరియ‌స్‌గా అడిగిన ప్ర‌శ్న‌కు.. బీజేపీ అంతే లైట్‌గా ఆన్స‌ర్ ఇచ్చిన ఘ‌ట‌న సోమ‌వారం పార్ల‌మెంటులో ఏపీ పార్ల‌మెంటు స‌భ్యుల‌ను నివ్వెర‌పాటుకు గురిచేసింది. లోక్‌సభ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు మాట్లాడుతూ.. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలిపారు. దీంతో రాష్ట్రం ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంద‌న్నారు. ఉద్యోగుల‌కు వేత‌నాలు స‌రిగా చెల్లించ‌డం లేద‌ని, కీల‌క మౌలిక స‌దుపాయాలైన ర‌హ‌దారుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించ‌డం లేదని వివ‌రించారు.

అదేవిధంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న రాష్ట్రానికి ఇస్తున్న నిధుల‌ను కూడా ప్ర‌భుత్వం దారి మ‌ళ్లిస్తోంద‌ని రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటించ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఎఫ్ ఆర్ బీఎం ప‌రిమితుల‌కు మించి రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌న్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర కార్పొరేష‌న్లను అడ్డు పెట్టుకుని కూడా మ‌రిన్ని అప్పులు చేస్తోంద‌ని తెలిపారు. మ‌ద్యం నిషేధిస్తామ‌ని చెప్పిన రాష్ట్ర ప్ర‌భుత్వం బేవ‌రేజెస్ బాండ్ల‌ను విక్ర‌యించి మ‌ద్యంపైనా మ‌రిన్ని అప్పులు చేస్తోంద‌ని వివ‌రించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెల‌పాల‌ని ఆయ‌న సీరియ‌స్‌గానే ప్ర‌శ్నించారు.

అయితే, రామ్మోహ‌న్ నాయుడు లోక్ స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చాలా తాపీగా, ఏమాత్రం సీరియ‌స్ నెస్ లేకుండానే స‌మాధాన‌మిచ్చారు. FRBM ప‌రిమితి అనేది రాష్ట్రాలను బ‌ట్టి ఉంటుంద‌ని తెలిపారు. దీనిపై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల‌లో FRBM ప‌రిమితిపై చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని పేర్కొన్నారు. ఇక‌, రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిమితికి మించి అప్పులు చేస్తోంద‌న్న వ్య‌వ‌హారంపై స్పందిస్తూ.. ఆర్టిక‌ల్ 293 ప్ర‌కారం దృష్టి సారిస్తామ‌న్నారు. అంత‌కుమించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నించిన వారు.. జ‌గ‌న్ స‌ర్కారుపై బీజేపీ ప్రేమ అంటే ఇలానే ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.