రేవంత్ పై న‌మ్మ‌కంతో జార్ఖండ్ రాజకీయం

Hyderabad

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వారికి తెలిసిన‌ట్టుంది. బీజేపీ ఎలాంటి వారినైనా త‌న వైపున‌కు ఎలా తిప్పుకుంటుందో వారికి బాగా అనుభ‌వంలో ఉన్న‌ట్టుగా ఉంది.. అందుకే.. అనూహ్య‌మైన ప‌రిస్థితిలో అంతే అనూహ్యంగా వ్య‌వ‌హ‌రించారు… జార్ఖండ్ అధికార ప‌క్ష కూట‌మి పార్టీలు. అవే.. జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా), కాంగ్రెస్ పార్టీలు. ప్ర‌స్తుతం జార్ఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభం నెలకొన్న విష‌యం తెలిసిందే. సీఎం హేమంత్ సొరేన్‌పై ఈడీ కేసులు న‌మోదు చేయ‌డం అరెస్టు చేయ‌డంతో ఆయ‌న ప‌దవిని కోల్పోయారు. ఈ ప‌దవి కోసం.. పార్టీలో హైడ్రామా న‌డించింది. చివ‌ర‌కు వీర‌విధేయుడైన చంప‌య్ సొరేన్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఎన్నుకున్నారు.

ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం కూడా చేసేశారు. ఏకంగా 43 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా(జేఎంఎం+కాంగ్రెస్‌) ఉంది. అయిన‌ప్ప‌టికీ.. బీజేపీపై వారికి ఇసుమంత న‌మ్మ‌కం లేదు. ఏక్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో అనే బెంగ వెంటాడింది. అందుకే అనూహ్యంగా ఎమ్మెల్యేల‌ను రెండు ప్ర‌త్యేక విమానాల్లో రాంచీ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లించేశారు. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ‌మే ఉండ‌డం.. పార్టీకి న‌మ్మిన బంటు వంటి, ఫైర్ బ్రాండ్ రేవంత్ అండ‌గా ఉండ‌డంతో ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో ఇక్క‌డ‌కు త‌ర‌లించేశారు. అయితే.. త‌ర‌లించేప్పుడే ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు తీసేసుకున్నారు.

ఎందుకు?

ఇలా 43 మంది ఎమ్మెల్యేల‌ను ఎందుకు త‌ర‌లించారంటే.. కొత్త ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన చంప‌య్ సోరెన్‌పై బీజేపీ నేత‌లు.. బ‌ల నిరూప‌ణ చేసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇదే విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు కూడా నివేదించారు. దీంతో ఆయ‌న స‌భ లో బ‌ల‌నిరూప‌ణ‌కు ఆదేశించారు. ఫ‌లితంగా చంప‌య్ సొరేన్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టికీ.. త‌న ఎమ్మెల్యేల సంఖ్యాబ‌లాన్ని స‌భ‌లో నిరూపించుకోవాల్సి ఉంది. ఇది జ‌రిగేందుకు మూడు రోజుల స‌మ‌యం ఉంది. శ‌నివారం, ఆదివారం సెల‌వులు కావ‌డంతో ఈ రెండు రోజులు ఎమ్మెల్యేల‌ను సొంత రాష్ట్రంలో కాపాడుకోవ‌డం.. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి వారిని ర‌క్షించుకోవ‌డం అంత తేలిక విష‌యం కాద‌ని గ్ర‌హించారు. దీంతో వారిని గుండ‌గుత్త‌గా హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.

మ‌రోవైపు.. మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయ‌న సుప్రీంకోర్టు మెట్లెక్కారు. త‌న అరెస్టును కొట్టి వేయాల‌ని అభ్య‌ర్థించారు.కానీ, సుప్ఈరం కోర్టు మాత్రం.. త‌మ‌కు సంబంధం లేద‌ని.. రాంచీహైకోర్టులోనే తేల్చుకోవాల‌ని చెప్పింది. ఇదిలావుంటే.. హైకోర్టు మాత్రం హేమంత్ పిటిష‌న్‌ను సోమ‌వారం విచారిస్తామ‌ని తేల్చి చెప్పింది. ఇంకోవైపు.. ప్ర‌జాప్ర‌తినిధుల కేసులు విచారించే కోర్టు.. హేమంత్‌ను ఐదు రోజుల క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ.. తీర్పు చెప్పింది.