నాకే టికెట్.. లేకుంటే వాళ్లు ఉరేసుకుంటారు-జలీల్ ఖాన్

బీకాంలో ఫిజిక్స్ కామెంట్‌తో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. టీడీపీ ముస్లిం మైనారిటీ నేతల్లో బాగా పేరున్న ఈయన.. కొన్నేళ్ల నుంచి అంత యాక్టివ్‌గా లేరు. 2019 ఎన్నికల్లో జలీల్ పక్కకు తప్పుకుని తన కూతురు షబానాకు టికెట్ ఇప్పించుకున్నారు. ఐతే ఆ ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైంది షబానా.

ఐతే ఈసారి ఎన్నికల్లో తనే పోటీ చేయాలని అనుకుంటున్నారు జలీల్ ఖాన్. కానీ పొత్తులో భాగంగా జనసేన కోసం టీడీపీ ఈ సీటును త్యాగం చేయొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనారిటీలు ఉరేసుకుంటారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

“విజయవాడ వెస్ట్ క్యాండిడేట్ నేనే. నేనే నిలుచుంటా. గెలిచేది నేనే. అడగడానికి అందరూ అడుగుతారు సీట్లు. కానీ గెలిచే స్థోమత ఉండాలి. ప్రజల్లో మంచి విలువలు ఉండాలి. క్యారెక్టర్ ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్లు సర్వే రిపోర్ట్‌లో ఎవరొస్తే వాళ్లకే టికెట్ ఇస్తారు. ఇది మాత్రం తెలుగుదేశం సీట్. తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలి. తెలుగుదేశం ఉంటేనే గెలవగలగతాం. వేరే వాళ్లు వస్తుంటారు. వెళ్తుంటారు. అడగడంలో తప్పు లేదు. సర్వే రిపోర్టును బట్టి గెలిచే వ్యక్తికి నాయకుడు టికెట్ ఇస్తారు. సీటు ఇవ్వకుంటే ఉరి వేసుకుంటారు మా వాళ్లు. ముస్లిం మైనారిటీలంతా సిద్ధంగా ఉన్నారు ఉరి వేసుకోవడానికి. వాయిస్ ఆఫ్ ద పీపుల్ జలీల్ ఖాన్ అంటారు విజయవాడ వెస్ట్‌లో. ఇప్పటికే నేను ఆపి ఉంచాను. లేకుంటే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరి వేసుకునేవాళ్లు’’ అని జలీల్ ఖాన్ పేర్కొన్నారు.