నో డిస్ట్రబెన్స్ ప్లీజ్

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల వరకు తెలంగాణా పీసీసీని మార్చేది లేదని ఐఏసీసీ కీలక నేతలు స్పష్టం చేశారట. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగాను, పీసీసీ అధ్యక్షుడిగా డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే వెంటనే పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసేస్తారు. అయితే తెలంగాణాలో మాత్రం రేవంత్ అలా చేయలేదు. అందుకనే కొందరు సీనియర్లు ఢిల్లీలోని కీలక నేతలతో భేటీ అయినపుడు రేవంత్ రాజీనామా విషయాన్ని ప్రస్తావించారట.

అందుకు కీలక నేతలు సమాధానమిస్తు కొంతకాలం రేవంత్ నే అధ్యక్షుడిగా కూడా కంటిన్యు చేయాలని అధిష్ఠానం డిసైడ్ చేసినట్లు చెప్పారట. జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దగ్గర పీసీసీ అధ్యక్షుడిగా కొత్త నేతను నియమించే విషయం చర్చకు వచ్చినపుడు కేసీయే పై వ్యాఖ్యలు చేశారట. రేవంత్ ప్లేసులో ఇంకెవరున్నా పార్టీకి ఊపొచ్చేది కాదు అధికారంలోకి వచ్చేది కాదన్న గట్టి నమ్మకం కాంగ్రెస్ అధిష్టానంలో బలంగా నాటుకుపోయిందట. అందుకనే ఎవరు రేవంత్ ను డిస్ట్రబ్ చేసేందుకు లేదని చెప్పిందట.

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రేవంత్ నాయకత్వంలోనే పార్టీ వెళుతుందని స్పష్టంగానే కొందరు నేతలకు కేసీ చెప్పేశారట. పార్లమెంటు ఎన్నికల్లోపు పార్టీ-ప్రభుత్వాన్ని రేవంతే బ్యాలెన్స్ చేసుకుంటారని అర్ధమవుతోంది. ఇపుడు గనుక పీసీసీ అధ్యక్షుడిగా కొత్త నేతను నియమిస్తే అందులో నిలదొక్కుకునేందుకే సమయం పడుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో రేవంత్ జాగ్రత్తగానే వ్యవహరించారని సమాచారం.

ఇపుడు ఎన్నికైన 64 మంది ఎంఎల్ఏల్లో రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండాలని సుమారు 40 మంది మొదటి ప్రాధాన్యతగా ఓట్లేశారని పార్టీవర్గాల సమాచారం. అంటే ఎంఎల్ఏలు, పార్టీపైన రేవంత్ అంత పట్టుసాధించారు. కొత్తగా పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే కొత్తధ్యక్షుడు ఒక జాబితా ఇచ్చి, రేవంత్ మరొకరిని ప్రతిపాదించి నానా గొడవలవుతాయని అధిష్టానం ఆలోచించిందట. అందుకనే పార్లమెంటు ఎన్నికలు అయ్యేవరకు రేవంతే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యు అయితే ఎలాంటి సమస్యలు ఉండవనే భావనలో ఉందట. కాబట్టి నేతలు ఎవరు కూడా రేవంత్ ను డిస్ట్రబ్ చేయద్దని స్పష్టంగా చెప్పేసిందట.