అమ్మ‌బాబోయ్ ఏపీ.. తెలంగాణ‌ను మించిన జ‌ర్క్‌లు..!

గ‌త ఏడాది డిసెంబ‌రులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. రాజ‌కీయాలు చిత్ర విచిత్రంగా మారిపోయాయి. అప్ప‌ట్లో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పోటా పోటీ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఎప్పుడుఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో.. ఎప్పుడు ఎవ‌రు ఎటు జంప్ చేస్తారో.. అనేది చెప్ప‌డానికే కాదు.. ఊహించ‌డానికి కూడా చోటు దొర‌క‌లేదు. ఇక‌, నాయ‌కుల మ‌ధ్య పోటీ.. నాయ‌కుల మ‌ధ్య మాట‌ల మంట‌లు.. అన్నీ తెలంగాణ రాజ‌కీయాల‌ను వేడెక్కించాయి. వీటిని నిశితంగా ప‌రిశీలించిన వారు.. ఎంతో ఆశ్చ‌ర్యపోయారు. బుగ్గ‌లు కూడా నొక్కుకున్నారు.

అయితే.. ఇప్పుడు ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయాలు.. చోటు చేసుకుంటున్న జ‌ర్క్‌లు.. అమ్మ‌బాబోయ్ ఏపీ అని అనిపిస్తున్నాయి. తెలంగాణ‌ను మించి పోయిన రీతిలో రాజ‌కీయాలు ఏపీలో వేడెక్కాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ అనుకున్న‌ట్టుగా ఉన్న రాజకీయాలు.. అనూహ్య యూట‌ర్న్ తీసుకుని అన్నా వ‌ర్సెస్ చెల్లెలుగా మారిపోయాయి. ఇక‌, రాజ‌కీయాల‌కే కాకుండా.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, వైఎస్సార్ పాల‌న‌, రాజ‌న్న రాజ్యం.. వైసీపీని నిల‌బెట్ట‌డం, జ‌గ‌న్ జైలు.. ఇలా అబ్బో తెల్లారితే ఏదొ ఒక కొత్త విష‌యం తెర‌మీదికి వ‌స్తూనే ఉంది. ఇరు పక్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుస్తూనే ఉంది.

ఇక‌, ఈ వైసీపీ వ‌ర్సెస్ ష‌ర్మిల రాజ‌కీయంలో రేపో మాపో మ‌రో అనూహ్య మ‌లుపు చోటు చేసుకుంటుంద‌ని తెలుస్తోంది. అన్నా చెల్లెళ్ల మాతృమూర్తి విజ‌య‌మ్మ కూడా ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏపీలో త‌న‌యుడి అధికారాన్ని నిల‌బెట్టేందుకు.. విజ‌య‌మ్మ రంగంలోకి దిగ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆమె త‌న‌యుడి ప‌క్షానే వ‌హించ‌నున్నార‌ని, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పొలిటిక‌ల్ వార్‌లో త‌న‌యుడి అధికారం కోసం.. ఆమె కూడా బ‌రిలో దిగుతున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే జ‌రిగితే.. ఇక‌, ఏపీలో ఒకే కుటుంబంలోని త‌ల్లి, త‌న‌యుడు, కుమార్తెల రాజ‌కీయం మ‌హారంజుగా మార‌నుంది.

ఇదిలావుంటే.. టీడీపీ , జ‌న‌సేన పొత్తు విష‌యం కూడా మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యంగా మారింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మైన పొత్తులో ఉన్న లోపాల లుక‌లుకలు ఇరు పార్టీల అగ్ర‌నేత‌ల‌కు కూడా చేరిపోయింది. జ‌న‌సేన అగ్ర‌నేత నాగ‌బాబు.. మాట‌కు మాట అన్న‌ట్టుగా టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, ప‌వ‌న్ కూడా.. త‌మ‌పైనా ఒత్తిడి ఉందంటూ.. త‌మ పార్టీ విధానాన్ని చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తు పార్టీల మ‌ధ్య ఎప్పుడూ చూడ‌ని అనూహ్య వాతావ‌ర‌ణం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందే.. చూడాల్సి రావ‌డం.. ఏపీలోనే జ‌రిగింద‌నే చ‌ర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా.. తెలంగాణ ఎన్నిక‌ల వేళ చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు మించి.. ఏపీలో రోజు రోజుకు రాజ‌కీయం మారుతుండ‌డం ఆస‌క్తిగా మారింది.