ఐదు వ్యూహాల‌తో ఎన్నిక‌ల‌కు వైసీపీ.. ‘సిద్ధం’

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఐదు వ్యూహాల‌తో రెడీ అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు పార్టీ ‘సిద్ధం’ పేరుతో ఎన్నిక‌ల యుద్ధంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలో ఈ ఐదు వ్యూహాల‌ను పార్టీ ప్ర‌క‌టించింది. సీఎం జ‌గ‌న్‌ ‘సిద్ధం’ పేరుతో తన మొదటి అధికారిక రాజకీయ ప్రచారానికి విశాఖ‌లో శ్రీకారం చుట్టారు. ఇక‌, నుంచి ఈ స‌భ‌లు రాష్ట్ర వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి సీఎం జగన్ తో పాటు కార్యకర్తలు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేలా వ్యూహ ర‌చ‌న చేశారు.

వ్యూహాలు ఇవీ..

  • మీడియా, సోషల్ మీడియాలో ఈవెంట్ పై సందడి సృష్టించేందుకు, పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అనేక హోర్డింగ్‌లు, బ్యానర్‌లను “సిద్ధం” అనే టైటిల్‌తో పెట్టింది. ఎలాంటి సవాల్ వచ్చినా స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని వీటి ద్వారా ప్ర‌తిప‌క్షాల‌కు పంపించారు.
  • ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ గీతాల‌కు ప్రాధాన్యం ఉంటుంది. అలానే వైసీపీ కూడా సిద్ధం పేరుతో సోషల్ మీడియాలో ‘ఓ వైసీపీ కార్యకర్తలారా’ అనే ప్రత్యేక పాటను విడుదల చేసింది. ఇది ప్రత్యేకంగా సిద్దం ప్రచారం కోసం రూపొందించిన పాట.
  • ఎక్కడ సిద్ధం స‌భ జ‌రిగినా స‌భ‌లో క్యాడర్‌కు అతి దగ్గరగా వెళ్లి మాట్లాడేందుకు ర్యాంప్ ను ఏర్పాటు చేస్తారు. తాజాగా విశాఖ‌లో స‌భ‌కు కూడా ర్యాంపును ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌ క్యాడర్‌ దగ్గరకు స్వయంగా వెళ్లి మాట్లాడేందుకు, క్యాడర్ కు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ఈ ర్యాంప్‌ను రూపొందించారు.
  • వైసీపీ పార్టీ క్యాడర్ మణికట్టుపై సిరా వేసినట్లు ప్ర‌త్యేక స్టాంపు వేస్తారు. ఇది పార్టీ పట్ల వారి విధేయత, మద్దతును తెలియజేస్తుంది.
  • ప్రతిపక్ష నేతల వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేస్తూ.. ఏక‌కాలంలో కీలక సందేశం పంపేలా ప్రత్యేక గేమ్‌ను రూపొందిచారు.