ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ‘దివ్యాంగ శక్తి’ పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం క‌ల్పిస్తారు. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు బస్సు ప్రయాణం చేశారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు వీరి ప్ర‌యాణం సాగింది.

సుమారు 11 కిలో మీట‌ర్ల‌ మేర దివ్యాంగులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురిం చి అడిగి తెలుసుకున్న సీఎం చంద్ర‌బాబు భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు తీసుకురానున్న‌ట్టు వివరించారు. పథకం ప్రారంభం సందర్భంగా ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంగళగిరి బస్టాండ్ నుంచి పాత మంగళగిరి వ‌ర‌కు ఆ ప్రాంతమంతా ప‌సుపు తోర‌ణంగా మారిపోయింది.

రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ స‌హా ప‌లువురు నాయ‌కులు ముందుకు సాగారు. దివ్యాంగులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ పల్లె వెలుగు బస్సులో వారితో క‌లిసి నాయ‌కులు ప్ర‌యాణించారు. డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక బస్టాప్ కు చేరుకున్నారు.

ప‌క్క‌ప‌క్క‌నే లోకేష్‌-ప‌వ‌న్‌

కాగా.. బ‌స్సులో ప‌క్క ప‌క్క‌నే ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ కూర్చుని ముందుకు సాగారు. దారి పొడ‌వునా అంద‌రినీ ప‌ల‌క‌రించారు. కాగా.. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ లోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అంద‌నుంది. 21 కేటగిరీల్లో వైక‌ల్యాల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ పథకం అమలు చేస్తారు. వారికి ఉచిత ప్ర‌యాణంతోపాటు.. వారి స‌హాయ‌కుల‌కు 50 శాతం రాయితీపై రాష్ట్రంలో ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కైనా ప్ర‌యాణించే వెసులుబాటు క‌ల్పిస్తారు.