క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది. సినిమాల గురించే కాక సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా చాలా నిక్కచ్చిగా మాట్లాడతాడని పార్తీబన్‌కు పేరుంది. ఇటీవల త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన ఒక కామెంట్ వివాదాస్పదం కాగా.. తర్వాత క్షమాపణ చెప్పడం, మళ్లీ త్రిష స్పందన చూశాక కోపం వచ్చి ఆమెను ఎటాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు పార్తీబన్ మరోసారి సారీ చెప్పారు. అది ఒక తెలుగు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో తాను యథాలాపంగా చేసిన ఒక కామెంట్ వల్ల కావడం గమనార్హం. ఆ చిత్రమే.. ఉస్తాద్ భగత్ సింగ్. ఇంత సుదీర్ఘ కెరీర్లో తమిళ అనువాదాలతో పలకరించడమే తప్ప, ఎప్పుడూ తెలుగు చిత్రాల్లో నటించని పార్తీబన్.. తొలిసారిగా ‘ఉస్తాద్’ లాంటి పెద్ద సినిమాలో విలన్ పాత్ర చేశారు.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పార్తీబన్ మాట్లాడుతూ.. తాను కూడా తెలుగు వాడినే అంటూ, తాను నాయుడి గారి అబ్బాయిని అని తన మూలాలను వెల్లడించారు. తమిళనాడులోనే పుట్టి పెరగడం వల్ల తనకు తెలుగు రాదని.. త్వరలో నేర్చుకుంటానని చెప్పారు.

ఐతే నాయుడి గారి అబ్బాయిని అని చెప్పడం ద్వారా బహిరంగ వేదికలో తన కులమేంటో బయటపెట్టినందుకు చింతిస్తూ ఇప్పుడు పార్తీబన్ క్షమాపణ చెప్పారు. ఆయన వ్యాఖ్యల మీద పెద్ద వివాదమేమీ లేనప్పటికీ.. తాను అలా తన కులాన్ని వెల్లడిస్తూ ఇలాంటి వేదికల్లో మాట్లాడ్డం సమంజసం కాదని పార్తీబన్ అభిప్రాయపడ్డారు.

తాను కుల వ్యవస్థను తప్పుబడుతూ ఎన్నో సినిమాలు చేశానని.. అలాంటిది తాను ఉద్దేశపూర్వకంగా ఇలా ఎలా మాట్లాడతానని పార్తీబన్ అన్నారు. పొరపాటుగా ఆ ఈవెంట్లో నోరు జారానని.. ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్త పడతానని పార్తీబన్ స్పష్టం చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ గురువారమే ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పార్తీబన్ రోల్ పవర్‌ ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం.