సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టు వైరల్గా మారింది..“ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలు, ఆంటీలతో చాట్ చేయండి” వంటి ప్రకటనలు చూస్తే మోసపోవద్దని సీపీ సూచించారు. ఇలాంటి యాడ్స్ వెనుక సైబర్ నేరగాళ్ల ఉచ్చు దాగి ఉందని స్పష్టం చేశారు.
యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు హనీట్రాప్లకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ ప్రకటనల్లో కనిపించే మహిళలు నిజమైనవారు కాదని, అవన్నీ ఏఐ సాంకేతికతతో సృష్టించిన వీడియోలేనని వెల్లడించారు. ఇలాంటి లింక్ల ద్వారా యాప్స్ డౌన్లోడ్ చేస్తే ఫోన్లోని కాంటాక్ట్స్, గ్యాలరీ వంటి వ్యక్తిగత సమాచారం నేరగాళ్లకు చేరుతుందని హెచ్చరించారు. అనంతరం వీడియో కాల్స్ ద్వారా న్యూడ్ వీడియోలు ప్లే చేసి, బాధితుడి ముఖాన్ని రికార్డ్ చేసి, మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారని తెలిపారు.
పరువు భయంతో డబ్బులు చెల్లిస్తే చివరకు బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వేదికల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆన్లైన్లో పరిచయమయ్యే ప్రతి ఒక్కరూ నిజమైన స్నేహితులు కాదని, ఆకర్షణ వెనుక మోసం దాగి ఉంటుందని గుర్తించాలని సూచించారు. ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ను డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తపడాలని కోరారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైన వారు భయపడకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates